రోహిత్ భారీ విరాళం:
కరోనాపై పోరాటం కోసం రోహిత్ శర్మ మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా పేదల భోజనానికి, వీధి కుక్కుల సంరక్షణ కోసం రోహిత్ విరాళమిచ్చాడు.
బాధ్యత మనందరిపై ఉంది:
భారత దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలి. ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. నావంతు సాయంగా విరాళం అందించానన్నాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోదీతో పాటు నాయకులకు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు విరాళమిచ్చి.. వీధి శునకాల సంక్షేమానికి హిట్మ్యాన్ తోడ్పాటునందించాడు. జంతు ప్రేమికుడిగా రోహిత్ మరోసారి నిరూపించుకున్నాడు.
కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే:
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నానికి దాదాపు 1,400కి చేరుకోగా.. మృతులు 32గా నమోదైంది. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 248 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఎక్కువ మంది క్రికెటర్లు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ పండ్కి విరాళాన్ని కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా క్రికెటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ఇవ్వగా.. స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు డొనేట్ చేశారు.
ఇప్పటికే ఎంతోమంది:
ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్, టెస్ట్ స్పెసలిస్ట్ అజింక్య రహానే, టీ20 స్పెషలిస్ట్ సురేష్ రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు విరాళాలు ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా భారీ విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50లక్షల విలువైన బియ్యాన్ని అవసరార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించాడు. పఠాన్ బ్రదర్స్ 4000 మాస్కులను అందించారు.