రోహిత్ శర్మ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "టీ20 సిరీస్ ఓటమి నిరాశ కలిగించింది. 213 పరుగుల లక్ష్యం చాలా కష్టమే. కానీ.. ఆఖరి ఓవర్ వరకూ భారత్ జట్టు గెలుపు అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటూ వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడిని చక్కగా అధిగమించి.. చివర్లో వరుసగా యార్కర్లు వేయగలిగారు. కివీస్ పర్యటనని వన్డే సిరీస్ విజయంతో భారత్ జట్టు మెరుగ్గానే ఆరంభించింది" అని అన్నాడు.
యువ క్రికెటర్లు కూడా
"టీమ్లోని యువ క్రికెటర్లు కూడా అన్ని మ్యాచ్ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. కానీ.. సుదీర్ఘ పర్యటనని గెలుపుతో ముగించలేకపోయాం. ఇది కొంచెం నిరాశ కలిగించింది. ఓడినా ఈ పర్యటనలో మాకు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. పర్యటన ఆసాంతం మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. బాగా శ్రమించారు" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం
"అయితే.. ఈ తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. విజయంతో ముగించలేకపోయినందుకు వాళ్లకు నిరాశ కలుగుతుండొచ్చు. కానీ మేం తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాం. ఆస్ట్రేలియాపై సిరీస్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. వన్డే సిరీస్ను గెలుచుకున్నామన్న సంతృప్తితో తిరిగి వెళుతున్నాం" అని రోహిత్ శర్మ అన్నాడు.
ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరిస్
కాగా, ఈ సిరీస్ కంటే ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్ను 4-1 తేడాతో భారత్ జట్టే గెలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. భారత్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు ఆడనుంది.