ఆ సిరీస్లో సచిన్ ఫిట్గా లేకున్నా.. బాధను భరిస్తూనే ఆడాడు: రాబిన్ ఊతప్ప

న్యూఢిల్లీ: టీమిండియా చారిత్రాత్మక విజయాల్లో ఒకటైన 2008 కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ శారీరకంగా ఫిట్గా లేకున్నా నొప్పిని పంటి బిగువన భరిస్తూ ఆడాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ఫైనల్స్లో సచిన్ దుమ్మురేపి భారత్కు టైటిల్ అందించాడు. ఓవైపు నొప్పితో బాధపడుతున్నా.. మరోవైపు 10 మ్యాచ్ల్లో 399 రన్స్ చేసి మూడో ఫైనల్ ఆడకుండానే భారత జట్టును విజేతగా నిలిపాడు.
ఈ సిరీస్లో రాబిన్ ఊతప్ప ఓపెనర్గా బరిలోకి దిగి మాస్టర్తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ఆ సీరిస్లో సచిన్.. నొప్పితో ఎలా బ్యాటింగ్ చేశాడనే విషయం తనకు అర్థం కాలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాటి సిరీస్ విశేషాలను పంచుకున్నాడు.

నొప్పితోనే..
'నిజంగా మీరు ఇది నమ్మరు. సచిన్ టెండూల్కర్ను నేను పాజీ అని పిలిచేవాడిని. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో అతను తీవ్ర నొప్పితో బ్యాటింగ్ చేశాడు. శారీరకంగా ఫిట్గా లేకున్నా.. నొప్పిని పంటిబిగువన భరిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఆ నొప్పితోనే జట్టుకు విజయాలందించాడు. అంతా ఓకెనా.. సౌకర్యంగా ఉన్నారా? అని మేం అడిగిన ప్రతీసారి.. 'నేను బాగున్నాను'అని బదులిచ్చేవాడు. ప్రతీ సారి జట్టు అవసరాన్ని గుర్తిస్తూ ఆడేవాడు. ఆ సిరీస్లో సచిన్ చాలా నొప్పితో ఆడాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి.

35 ఏళ్లప్పుడు కష్టమబ్బా..
ఆ సిరీస్లో ఓ మ్యాచ్ సందర్భంగా సచిన్తో జరిగిన సంభాషణ నాకింకా గుర్తుంది. 'రాబిన్.. 32, 33, 34 ఏళ్ల వయసులో ఫిట్గా ఉండటం కష్టమబ్బా.. గాయాలు తిరగబెడతాయి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.'అని సచిన్ నాతో అన్నాడు. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. దానికి నేను 'అలా ఏం ఉండదు పాజీ.. మీరు ఊరికే అలా చెబుతున్నారు.'అన్నాను.
వెంటనే సచిన్.. 'రాబిన్.. నీకు 35 ఏళ్లు వచ్చిన తర్వాత మళ్లీ దీని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు నాతో నువ్వు అంగీకరిస్తావో లేదో చూద్దాం'అని చెప్పాడు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు.. మీ అందరికి నేను చెబుతున్నా.. సచిన్ చెప్పింది నిజమే'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

ఫైనల్స్లో దుమ్మురేపిన సచిన్..
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఈ ట్రై సిరీస్ జరగ్గా.. ఒక్కో జట్టు 8 మ్యాచ్లు ఆడాయి. అయితే ఈ 8 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా 5, భారత్ 3 గెలిచి ఫైనల్కు చేరగా.. శ్రీలంక 2 విజయాలతో నిష్క్రమించింది. ఈ సిరీస్ ఫైనల్ను బెస్టాఫ్ -3 ఫార్మాట్లో నిర్వహించారు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి ఫైనల్లో సచిన్ 117 పరుగులతో రాణించడంతో భారత్ సునాయస విజయాన్నందుకొని 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో ఫైనల్లో కూడా సచిన్ 91 పరుగులతో రాణించడంతో మరో ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే భారత్ టైటిల్ కైవసం చేసుకుంది.

టీమ్మేనేజ్మెంట్ వల్లే నా కెరీర్ నాశనం..
ఇక టీమిండియా మేనేజ్మెంట్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఊతప్ప తెలిపాడు. 'నా అంతర్జాతీయ కెరీర్ ఆశించినంత సక్పెస్ఫుల్గా మాత్రం సాగలేదు. నా గణంకాలను చూస్తే.. నేను ఆడిన మ్యాచ్లు తక్కువే అయినా చాలా బ్యాటింగ్ పొజిషన్లలో ఆడాను. ప్రతీ మూడు మ్యాచ్లకు ఒకసారి నా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ ఉండేవాళ్లు. అసలు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. ఒకే బ్యాటింగ్ పొజిషన్లో ఆడుంటే ఇండియాకు చాలా రోజులు ఆడేవాడిని.
ఏ బ్యాట్స్మెన్కు అయినా పదేపదే బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ ఉంటే రాణించడం కష్టం అవుతుంది. ఆ సమయంలో జట్టు అవసరాల కోసం రకరకాల పొజిషన్లలో బ్యాటింగ్కు దింపేవాళ్లు. ఫలితంగా టీమ్కు మంచి జరిగింది. కానీ నా కెరీర్ను దెబ్బతీసింది'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications