పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ లెజెండ్.. మూడో రోజు ఆటలో భాగంగా కామెంట్రీ చెబుతూ కుప్పకూలాడు. వెంటనే పాంటింగ్ను సమీప ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఆసీస్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది.
'ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో కామెంట్రీ చెబుతూ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతను ఈ రోజు కామెంట్రీ బాక్స్కు దూరమయ్యాడు . శనివారం వస్తాడా? పూర్తిగా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అనే విషయంపై క్లారిటీ లేదు.'అని చానెల్ 7 ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం లంచ్ సమయంలో కామెంట్రీ చెబుతూ.. అన్ఈజీగా ఉందని పాంటింగ్ చెప్పాడని, గుండెలో నొప్పిగా ఉందని పేర్కొనడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని సహచర కామెంటేటర్లకు పాంటింగ్ చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నా కొంత కాలం ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.
ఇక పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సైతం గుండె పోటుతోనే ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు. ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
74/0 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు కుప్పకూలింది. క్రైగ్ బ్రాత్వైట్(166 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 64), చంద్రపాల్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్ వుడ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.
ఇక ఆస్ట్రేలియాకు 315 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. వార్నర్(18 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను 598/4 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్మిత్, లుబుషేన్ డబుల్ సెంచరీలతో సత్తా చాటారు.