24న భారత్, పాకిస్థాన్ మ్యాచ్:
ఈ ఏడాది అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. క్వాలిఫైర్ మ్యాచుతో మెగా టోర్నీ మొదలవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
అందరూ ఆ విషయాన్ని గుర్తుచుకోవాలి:
తాజాగా పాక్.టీవీలో హాసన్ అలీ మాట్లాడుతూ... '2017లో భారత్ని ఓడించి మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అందరూ ఆ విషయాన్ని గుర్తుచుకోవాలి. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి భారత్తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. అందుకోసం ప్రణాళికలు రచిస్తున్నాం' అని తెలిపాడు.
టోర్నీని విజయంతోనే ఆరంభిస్తాం:
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్ రమీజ్ రాజాతో బాబర్ ఆజామ్ ఇటీవలే సమావేశం అయ్యాడు. ఈ సమావేశం అనంతరం బాబర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదటి మ్యాచులోనే టీమిండియాకు ఎదుర్కోవడంను ఎలా ఫీల్ అవుతున్నారు అని ఓ విలేకరి ప్రశ్నించగా... 'పాకిస్థాన్తో పోల్చితే భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుంది. టీమిండియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం. కోహ్లీసేనపై మాదే పైచేయి. వారిని కచ్చితంగా ఓడిస్తాం. టీమిండియా ఆటగాళ్లు జట్టుగా టీ20 మ్యాచులు ఆడి చాలా రోజులవుతుంది. భారత జట్టు టెస్టులు ఆడింది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతారు. అక్కడ జట్టుగా కాకుండా ఒక్కో జట్టుకు ఆడుతారు. ఇక యూఏఈ మాకు సొంతిల్లు లాంటిది. అక్కడ అన్ని మాకు సానుకూలాంశాలే ఉంటాయి. అందుకే టీమిండియాతో జరిగే మ్యాచ్లో గెలవడానికి 100 శాతం మేం ప్రయత్నిస్తాం. టోర్నీని విజయంతోనే ఆరంభిస్తాం' అని అన్నాడు.
ఐసీసీ టోర్నీల్లోనే:
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది. మరి ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
భారత్దే పై చేయి..
పాకిస్థాన్పై ఏ ఫార్మాట్లోనైనా భారత్కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్ల పరంగా మాత్రం పాక్దే పైచేయి. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా, భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా, పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.
గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్లకి అర్హత సాధించనున్నాయి. పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.