
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్లో మత ప్రాతిపదికన ఆటగాళ్ల మధ్య అంతరాలు లేవని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పష్టం చేశాడు. తాను హిందువు అయిన కారణంగా కొందరు పాక్ ఆటగాళ్లు తనతో కలిసి భోజనం చేసేవాళ్లు కాదని మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలపై ఇంజమాముల్ మండిపడ్డాడు.
కనేరియా తన కెరీర్లో అత్యధిక శాతం తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పిన ఇంజమామ్ భారత క్రికెటర్లతో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇంజమామ్ మాట్లాడుతూ "కనేరియా అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. పాకిస్తానీయులు పెద్ద హృదయాలు కలిగి ఉన్నారని నా అభిప్రాయం. వారు ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు" అని అన్నాడు.
"15 ఏళ్ల విరామం తర్వాత టీమిండియా 2004లో పాక్ పర్యటనకు వచ్చినప్పుడు మా ఆతిథ్యానికి ఆ జట్టు ఆటగాళ్లు ఫిదా అయ్యారు. వాళ్లు ఎక్కడికెళ్లినా అద్భుతమైన ఘనస్వాగతం లభించింది. వారు తిన్న తిండికి, కొనుగోలు చేసిన వస్తువులకు మా దేశ వాసులు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఆ తర్వాతి ఏడాది మేము భారత పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మాకు అలాంటి ఆదరణే లభించింది" అని చెప్పాడు.
"2005లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గంగూలీ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను నేను, సచిన్ కలిసి ప్రారంభించాం. ఆ తర్వాత దాదా ప్రేమతో నాకు భోజనం పంపాడు. దానిని అంతే ఆప్యాయతతో తిన్నాము. భారత్, పాక్ జట్లు షార్జాలాంటి చోట ఆడుతున్న సమయంలో అంతా కలిసి ఒకే హోటల్లో బసచేసేవాళ్లం. అదరం కలిసే భోజనం చేసేవాళ్లం" అని ఇంజమామ్ వెల్లడించాడు.
"మత ప్రాతిపదికన ఒకరిని దూరం పెట్టేంత నీచ సంస్కృతి పాకిస్తాన్ జట్టులో లేదు. డానిష్ కనేరియా చెప్పిన అంశం ఒక్కసారి కూడా నా దృష్టికి రాలేదు. యూసుఫ్ యోహానా ముస్లిమేతరుడిగానే కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత ఇష్ట పూర్తిగానే ఇస్లాం స్వీకరించాడు. అతడు యోహానాగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు" అని తెలిపాడు.