సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్ట్లో భారత్కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. తొలుత వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడగా.. ఆ తర్వాత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా గాయమైంది. కమిన్స్ బౌలింగ్లో పంత్ మోచేతికి బలంగా తగలగా.. స్టార్క్ బౌలింగ్లో జడేజా ఎడమ బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ ఇద్దరు మైదానంలోకి రాలేదు. పంత్ గాయం తీవ్రత తెలుసుకోవడానికి ఆసుపత్రికి తరలించగా.. జడేజా డ్రెస్సింగ్ రూంమ్కి పరిమితమయ్యాడు. పంత్ స్థానంలో సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా.. జడేజా స్థానంలో మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.
వీరి గాయాలు సాధారణమైతే ఏం కాదు కానీ.. తీవ్రమైతే అది సిరీస్ ఫలితంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జడేజా సేవలను కోల్పోతే భారత జట్టుకు కష్టాలు తప్పవు. సిడ్నీ టెస్ట్లో పస్ట్ ఇన్నింగ్స్ జడేజా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఇక బౌలింగ్ కంటే అతని ఫీల్డింగ్ అందర్ని ఆకట్టుకుంది. స్టీవ్ స్మిత్ను రనౌట్ చేసిన విధానం ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అంతేకాకుండా లోయారార్డర్లో జడేజా విలువైన పరుగులు చేయగలడు. బ్యాట్స్మెన్ అంతా విఫలమైనా జడేజా(28 నాటౌట్) ఒంటరిగా పోరాడాడు. భారత సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలకం కానున్నాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్కు 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 25 ఓవర్లలో 2 వికెట్లకు 87 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(13), పుకోస్కీ(10) విఫలమయ్యారు. పుకోస్కీని సిరాజ్ ఔట్ చేయగా.. వార్నర్ను అశ్విన్ పెవిలియన్కు చేర్చాడు.