లండన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. గతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేజార్చుకున్న రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడని చెప్పాడు. రోహిత్ అంతలా బాధపడటం తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు రోహిత్ను కదిలిస్తే ఏడ్చేవాడేమోనని, అంతలా బాధపడ్డాడని శాస్త్రి గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి భారత్-ఇంగ్లండ్ సిరీస్లకు కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు.
రెండో వన్డే సందర్భంగా కామెంట్రీ చెబుతూ.. శాస్త్రి ఈ విషయాన్ని పంచుకున్నాడు. 'గతేడాది లార్డ్స్ టెస్ట్లో రోహిత్ శర్మ ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి చాలా సైలెంట్గా టేబుల్పై కూర్చున్నాడు. అతను ఓ రకమైన డిప్రెషన్లో కనిపించాడు. ముట్టుకుంటే ఏడ్చేస్తాడేమో అనిపించింది.
అతను సెంచరీ చేయాలని గట్టిగా అనుకున్నాడు. లార్డ్స్లో సెంచరీ చేస్తే ఆ ఫీలింగ్ వేరే రేంజ్లో ఉంటుంది. అందుకే సెంచరీ మిస్ అయినందుకు అతను చాలా బాధపడ్డాడు. అయితే అదే ఫీలింగ్తోనే ఓవల్లో సెంచరీ బాదాడు.'అని రవి శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
గత ఏడాది లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 151 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో 83 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సెంచరీ మార్కును 17 పరుగుల తేడాతో మిస్ చేసుకున్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ.. చాలా నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇంగ్లండ్తో జరిగిన ఆ టెస్ట్ సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 368 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఇటీవల జరిగిన రీషెడ్యూల్ టెస్ట్కు కరోనా కారణంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. తన కెరీర్లో 45 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ, 8 సెంచరీలు నమోదు చేశాడు. చాలా ఏళ్ల పాటు విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయిన రోహిత్ శర్మ, 2021లో ఇంగ్లండ్ టూర్లో ఆ ఫీట్ అందుకున్నాడు.