10 ఓవర్లు.. 30 పరుగులు.. నాలుగు వికెట్లు:
ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచి ప్రపంచకప్ను కైవసం చేసుకున్నా.. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. టీమిండియా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చనుకున్న బంగ్లా బ్యాట్స్మెన్స్కు తన అద్భుత బౌలింగ్తో ముచ్చెమటలు పట్టించాడు. రవి బిష్ణోయ్ బంగ్లా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన రవి 3 ఓవర్లు మేడిన్గా ముగించాడు.
ప్రపంచకప్ తీసుకొస్తాడని ఆశించా:
రవి బిష్ణోయ్ తన కోటా 10 ఓవర్లలలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు. బంగ్లా బ్యాబ్యాట్స్మన్ ఒకానొక దశలో షాట్ల ఆడడం పక్కన పెడితే.. రవి బౌలింగ్ చేసే గూగ్లీలు అర్థం తికమకపడ్డారు. సింగిల్స్ కోసం చాలా కష్టపడాల్సొచ్చింది. రవి ఇంతలా కష్టపడినా తన జట్టును మాత్రం గెలిపించలేకపొయాడు. మ్యాచ్ అనంతరం రవి తండ్రి మంగీలాల్ స్పందించాడు. 'నా కొడుకు ఇండియాకు ప్రపంచకప్ తీసుకొస్తాడని ఆశించా. అలా జరగనప్పటికీ శాయశక్తులా ప్రయత్నించాడు. టీమిండియా ఓడిపోవడంతో చాలా బాధగా ఉంది' అని తెలిపారు. రాజస్థాన్లోని జోధ్పూర్ మంగీలాల్ స్వస్థలం. అతను ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
నిరాశ చెందాం:
రవి బిష్ణోయ్ అన్నయ్య అశోక్ బిష్ణోయ్ మాట్లాడుతూ... 'రవి టోర్నమెంట్ అంతా మంచి ఆటతీరు కనబర్చడంతో కుటుంబం సంతోషంగా ఉంది. కానీ.. ఫైనల్లో రవి చేసిన ప్రదర్శన సరిపోకపోవడంతో అందరూ సంతృప్తిగా లేరు. ప్రపంచకప్లో నా సోదరుడు 17 వికెట్లు తీసాడు. ఫైనల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. అతను మాత్రమే కాదు మొత్తం జట్టు బాగా ఆడింది. కానీ భారత్ ఓడిపోవడంతో మేము నిరాశ చెందాం' అని చెప్పుకొచ్చాడు.
టీమిండియా తరఫున రికార్డు:
ప్రపంచకప్లో రవి బిష్ణోయ్ టీమిండియా తరఫున ఓ రికార్డు సృష్టించాడు. 17 వికెట్లతో ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. శాలభ్ శ్రీవాస్తవ (2000), అభిషేక్ శర్మ (2002), కుల్దీప్ యాదవ్ (2014), అనుకుల్ రాయ్ (2018) 15 వికెట్లు తీశారు. ఇక 2006లో పియూష్ చావ్లా, 2012లో సందీప్ శర్మ తర్వాత నాలుగు వికెట్లు తీసిన మూడవ భారతీయుడిగా బిష్ణోయ్ రికార్డుల్లోకి ఎక్కాడు.