మూర్ఖుల జాబితాలో చేరిపోయాడు:
ప్రముఖ వ్యాఖ్యాత రమీజ్ రాజా సోమవారం ఓ ట్వీట్ చేశాడు. 'ఉమర్ అక్మల్ అధికారికంగా మూర్ఖుల జాబితాలో చేరిపోయాడు. మూడేళ్ల నిషేధానికి గురయ్యాడు. ప్రతిభను ఎలా వృథా చేస్కున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు వ్యతిరేకంగా ఓ చట్టాన్నిరూపొందించాల్సిన సమయం మించిపోతున్నది. ఫిక్సింగ్కు పాల్పడిన వారిని జైళ్లలో వేయాలి. లేకపోతే మరింత మంది ధైర్యం చేస్తారు' అని రమీజ్ రాజా ట్వీట్ చేశాడు.
మూడేళ్లు నిషేధం:
మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన ఉమర్ అక్మల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. కరోనా వైరస్ కారణంగా చివరలో నిలిచిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆరంభానికి ముందు బుకీలు ఫిక్సింగ్ కోసం ఉమర్ని సంప్రదించారు. కానీ ఈ విషయాన్ని పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చే వరకూ ఉమర్ వారికి సమాచారం ఇవ్వలేదు. దీంతో రెండు నెలలు విచారణ జరిపిన పీసీబీ క్రమశిక్షణ కమిటీ.. మూడేళ్ల పాటు క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనూ ఉమర్ ఆడకుండా నిషేధం విధించింది.
మండిపడ్డ కమ్రాన్ అక్మల్:
ఇది చాలా కఠినమైన శిక్ష అని ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ అప్పీల్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. 'ఉమర్ అక్మల్పై మూడేళ్ల నిషేధం ఆశ్చర్యపరిచింది. ఇది చాలా కఠినమైన శిక్ష. కచ్చితంగా అతను ఈ నిషేధంపై అప్పీల్కి వెళ్తాడు. గతంలో ఇదే తప్పిదానికి పాల్పడిన మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్లకి ఇంత పెద్ద శిక్ష పడలేదు. కానీ ఇప్పుడు ఉమర్ విషయంలో మాత్రం మరీ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు' అని కమ్రాన్ ప్రశ్నించాడు.
శ్రీలంకపై చివరి టీ20 మ్యాచ్:
గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. 29 ఏళ్ల ఉమర్ అక్మల్ అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.