లండన్: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఐకన్లకు కొదవలేదు. ఒకరిని మించి ఒకరున్నారు. అదే ఓ దశాబ్దం లేదా అంతకంటే వెనక్కి వెళ్తే.. ఏ ఒకరిద్దరో ఉండేవారు. గ్రేట్ వాల్గా పేరున్న రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలి వంటి క్రికెటర్లు జట్టు తరఫున ఆడుతున్న సమయంలో- జీవించి ఉన్న క్రికెటర్లలో అత్యంత సెక్సీయస్ట్ పర్సన్గా రాహుల్ ద్రవిడ్ గుర్తింపు పొందాడు. సౌరబ్ గంగూలి, సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు ఉన్నప్పటికీ.. రాహుల్ ద్రవిడ్ను సెక్సీయస్ట్ పర్సన్గా ఎన్నుకున్నారట.
శనివారం- ఓ న్యూస్ ఛానల్లో ప్రసారమైన టాక్ షో సందర్భంగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. యాంకర్గా వ్యవహరించిన గౌరవ్ కపూర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. రాహుల్ ద్రవిడ్తో నిర్వహించిన టాక్ షో సందర్భంగా.. ఈ విషయాన్ని వెల్లడించారాయన. 2005లో ఓ సర్వే నిర్వహించగా.. అత్యంత సెక్సీయస్ట్ పర్సన్గా అప్పటి యూత్ రాహుల్ ద్రవిడ్ను ఎన్నుకున్నారట. ఈ విషయాన్ని గౌరవ్ కపూర్ ఈ టాక్ షో సందర్భంగా ప్రస్తావించారు.
దీనిపై రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్ను కాదని తనకు సెక్సీయస్ట్ పర్సన్గా గుర్తింపు దక్కడం ఆనందాన్నిస్తోందని అన్నారు. దీనికి సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్ ఉంటే ఇవ్వాలని, దాన్ని తాను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలించుకుంటానని ద్రవిడ్ చిరునవ్వుతో చెప్పుకొచ్చారు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ ఇన్నింగ్ తన కేరీర్లో అత్యుత్తమమైనదని ద్రవిడ్ వివరించారు. కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడి కూడా ఆస్ట్రేలియాను మట్టికరిపించింది భారత్.
హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో చెలరేగిపోయింది ఈ మ్యాచ్లోనే. అదే మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ 180 పరుగులు చేశారు. ఆ ఇద్దరి భారీ భాగస్వామ్యంతో భారత జట్టు రెండో ఇన్నింగ్లో ఏడు వికెట్ల నష్టానికి 657 పరుగులను చేసింది. ఆస్ట్రేలియాను 171 పరుగులతో ఓడించింది. తన కేరీర్లో ఆ టెస్ట్ మ్యాచ్ అత్యుత్తమైనదని ఈ టాక్షో సందర్భంగా రాహుల్ ద్రవిడ్ చెప్పారు. వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి ఇన్నింగ్ను నిర్మించిన తీరు అత్యద్భుతమని అన్నారు. లక్ష్మణ్ అసమాన పోరాటాన్ని ప్రదర్శించారని చెప్పారు.