హైదరాబాద్: యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్పంత్పై టీమిండియా అండర్-19, భారత్-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ యువ కిషోరానికి వైవిధ్యంగా బ్యాటింగ్ చేయగల సత్తా, నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. భారత్-ఏ తరఫున బ్రిటన్ పర్యటనకు వెళ్లిన పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్థిరంగా నిలబడి విజయాలు అందించాడు.
ఐపీఎల్లో, 2017-18 రంజీ సీజన్లో 900 పైచిలుకు పరుగులు సాధించి పంత్ తానెంత వైవిధ్యంగా బ్యాటింగ్ చేయగలడో నిరూపించాడు. అతడి స్ట్రైక్రేట్ సైతం అద్భుతం. బ్రిటన్ పర్యటనలో అత్యంత సవాల్గా నిలిచిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో అతడు 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెస్టిండీస్-ఏ మ్యాచ్లో జయంత్ యాదవ్తో కలిసి నాలుగో ఇన్నింగ్స్లో 100 పరుగులు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో సెలక్టర్లు పంత్ను టీమిండియాకు బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. 'తాను వైవిధ్యంగా బ్యాటింగ్ చేయగలనని రిషబ్ పంత్ నిరూపించాడు. అందుకు తగ్గ టెంపర్మెంట్, నైపుణ్యాలను ప్రదర్శించాడు. పంత్ దూకుడైన బ్యాట్స్మన్. అయితే ఎరుపు బంతితో ఆడుతునప్పుడు బ్యాట్స్మెన్ పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అతడు జాతీయ జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషం. పంత్ మరెంతో పరిణతి సాధించి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను' అని ద్రవిడ్ అన్నారు.
ఇక సీనియర్ జట్టు పర్యటిస్తున్న దేశానికే భారత్-ఏ జట్టును షాడో టూర్కు పంపిస్తూ బీసీసీఐ చక్కని నిర్ణయం తీసుకుంది. ఇది భారత క్రికెట్కు ఉపయోగకరం. అక్షర్పటేల్, శార్ధూల్ ఠాకూర్, కృనాల్ పాండ్య, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు సీనియర్ జట్టుకు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండగలుగుతున్నారు' అని ద్రవిడ్ వెల్లడించారు.