దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా మరికొద్ది సేపట్లో 32వ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ లేడు. అతడి స్థానంలో ఐడెన్ మార్క్రామ్ ఆడుతున్నాడు. ఫ్యాబియన్ అలెన్, నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్ ఫారిన్ ప్లేయర్స్. మరోవైపు రాజస్థాన్ ఇద్దరు హిట్టర్లకు చోటిచ్చింది. ఎవిన్ లూయిస్, లియమ్ లివింగ్స్టోన్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఇప్పటిదికా ఎనిమిది మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్.. మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఏడు మ్యాచ్ల్లో మూడే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉంది. దాంతో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇరు జట్లు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే ఈ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. గెలిచిన జట్టే ఆఫ్ రేసులో ఉంటుంది. ఒకవేళ పంజాబ్ ఓడితే.. మిగిలిన ఐదింటిలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన దుబాయ్ స్టేడియంలోనే ఈ రోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడనున్నాయి. ఆరంభంలో పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు దుబాయ్ పిచ్ అనుకూలించనుంది. మైదానం చాలా పెద్దది కాబట్టి భారీ స్కోర్లు నమోదవ్వడం కాస్త కష్టమే. అక్కడ ఉక్కపోత బాగా ఉండనుంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు. చేజింగ్ చేసే సమయంలో మంచు ప్రభావం ఉండనుంది. దుబాయ్ వికెట్పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 166. ఇక్కడ ఛేజింగ్ కష్టమే. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 40 శాతం మాత్రమే విజయాలు అందుకున్నాయి.
భారత్ వేదికగా జరిగిన మొదటి దశలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (119) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. దీపక్ హుడా (64), క్రిస్ గేల్ (40) రాణించారు. అనంతరం రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 217 రన్స్ చేసింది. శాంసన్ సెంచరీ వృధా అయింది. ఈరోజు కూడా మరోసారి ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగే అవకాశం ఉంది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ ( కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, ఆర్ష్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, ఇషాన్ పోరెల్.
రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, కీపర్), లియమ్ లివింగ్స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.