అహ్మదాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 3,86,452 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,498 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 31,70,228కి చేరింది. ఒకేసారి ఇన్ని లక్షలమందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్లో కనిపించట్లేదు. ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ తుదిశ్వాసను విడుస్తున్నారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీ టీమ్ పంజబ్ కింగ్స్.. తనవంతు సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడానికి భారీ ఎత్తున విరాళాన్ని ప్రకటిస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా తాము తమ విరాళం మొత్తాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ పరిస్థితులు ఏ మాత్రం ఊహకు అందని వింగా ఉంటున్నాయని పేర్కొంది. దేశానికి ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అత్యవసరమని గుర్తించామని, ఆ కొరతను తీర్చడానికి తమవంతు సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
To help the fight against #COVID19 in India, #PBKS has pledged to provide oxygen concentrators with the help of @roundtableindia! We also request everyone to join in and help in whatever way possible because together, we can! #SaddaPunjab #Unite2FightCorona pic.twitter.com/sZs5B1NDij
— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2021
పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్, ఫ్రాంఛైజీ సహా.. ఇందులో భాగస్వామ్యులుగా ఉన్న రౌండ్ టేబుల్ ఇండియా (ఆర్టీఐ)తో కలిసి సంయుక్తంగా విరాళాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా తమ విరాళం మొత్తాన్ని నిర్ధారిస్తామని వెల్లడించింది. ఎంత మొత్తంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాలనే విషయంపై ఒక అవగాహనకు వచ్చిన తరువాత.. దానికి అనుగుణంగా విరాళం మొత్తాన్ని ఖరారు చేస్తామని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ తెలిపింది. ఎంత ఆక్సిజన్ అవసరమౌతుందనే విషయంపై నివేదికలను తెప్పించుకుంటున్నామని పేర్కొంది.