ధోనీనే అడగండి:
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో తొలిసారి ఆదివారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగిన విషయం తెలిసిందే. బోర్డు ఏజీఎం ముగిశాక విలేకరులతో మాట్లాడిన గంగూలీకి టీ20 ప్రపంచకప్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటుంటుందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దాదా సమాధానమిస్తూ.. 'దయచేసి ఈ విషయాన్ని ధోనీనే అడగండి' అని అన్నాడు.
జనవరి వరకు ఏం అడగొద్దు:
ఇంగ్లాండ్లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ.. ఇటీవలే తన రిటైర్మెంట్పై స్పందించాడు. పునరాగమనం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...'జనవరి వరకు నన్ను ఏం అడగొద్దు' అని స్పష్టంగా చెప్పాడు. దీంతో జనవరి వరకు ధోనీ రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడినట్టే. అయితే టీ20 ప్రపంచకప్లో ఆడుతాడో లేదో స్పష్టమైన సమాచారం అయితే లేదు.
శాశ్వత సీఏసీ అవసరమా?:
'క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) అంతగా పని ఉండదు. సెలక్టర్లు, కోచ్ను మాత్రమే నియమిస్తుంది. ఆ తర్వాత సెలక్టర్లు నాలుగేళ్లు, కోచ్ మూడేళ్లు పదవిలో ఉంటారు. దీని కోసం శాశ్వత సీఏసీ అవసరమా?' అని గంగూలీ ప్రశ్నించాడు. 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం అందరికీ అడ్డంకిగా మారింది. దీంతో సీఏసీని, గొప్ప సెలక్టర్లను నియమించలేకపోతున్నాం. గొప్ప వ్యక్తుల సేవలను కోల్పోతున్నాం. విరుద్ధ ప్రయోజన అంశం ఆఫీస్ బేరర్స్పై ఉండాలి. దీనిపై స్పష్టత కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం' అని దాదా తెలిపాడు.
డే/నైట్ టెస్టులను నిర్వహిస్తాం:
'డే/నైట్ టెస్టు విజయవంతం అవ్వడంలో అరుణ్ ధుమాల్, జై షా, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కీలకపాత్ర పోషించారు. దేశంలో ఇతర స్టేడియాల్లో కూడా డే/నైట్ టెస్టులను నిర్వహించడానికి సిద్ధం. అయితే ఆయా అసోషియేషన్ అభ్యర్థన మేరకు నిర్వహిస్తాం. బోర్డు పింఛను తీసుకుంటూ ఉద్యోగాలు చేసే వాళ్లు ఉన్నారు. పింఛను అవసరమయ్యే వారికే అందేలా చూస్తాం. బీసీసీఐ ఆదాయం పెరుగుతుందని అందరి తెలుసు. దాంతో రాష్ట్రాలకు కావాలిసిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తాం. నూతన జాతీయ క్రికెట్ అకాడమీని నిర్మిస్తున్నాం' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.