హైదరాబాద్: 2015 సంవత్సరం అనంతరం మొట్ట మొదటి సారిగా పీసీబీ అధికార బృందం భారత్కు రానుంది. దాదాపు రెండున్నరేళ్ల తరువాత తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికార ప్రతినిధులు భారత్ను సందర్శించనున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశంలో పాల్గొనే ఉద్దేశ్యంతో పీసీబీ అధికారులు వస్తున్నారు. ఏప్రిల్ 21న కోల్కతాలో జరగనున్న సమావేశంలో పాక్ తరఫున పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శుభాన్ అహ్మద్ పాల్గొనున్నారు.
సేథీ బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత్కు రావడం ఇదే తొలిసారి. పీసీబీ మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ చివరిసారిగా 2015లో భారత్కు వచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై చర్చలు జరిపేందుకు షహర్యార్ ఖాన్ గతంలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
PCB delegation to visit India for ICCmeeting https://t.co/8ILNPgkake
— Updates24 (@Updates24in) April 19, 2018
ఈ సదస్సు నిమిత్తం ఐసీసీ పంపిన నివేదికను బీసీసీఐ తోసి పుచ్చింది. కోల్కత్తాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను రీ షెడ్యూల్ చేయాలని ఐసీసీ చేసిన విజ్ఞప్తిని సైతం బీసీసీఐ తోసిపుచ్చింది. షెడ్యూల్ను మార్చే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు కోల్కత్తాలో ఐసీసీ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
అదే సమయంలో నైట్రైడర్స్కు కోల్కతాలో ఎలాంటి హోమ్ మ్యాచ్లు లేవు. దీంతో ఎలాగైనా తమ ప్రతినిధుల కోసం కొన్ని మ్యాచ్లు ఉండేలా షెడ్యూల్ను మార్చాలని ఐసీసీ.. బీసీసీఐని కోరింది. షెడ్యూల్ ప్రకారం నైట్రైడర్స్ తన హోమ్ మ్యాచ్ ఏప్రిల్ 6న, మే 3న ఆడనుంది. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య హైదరాబాద్, ముంబై, ఇండోర్, బెంగళూరు, జైపూర్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
ఒకవేళ షెడ్యూల్ను మారిస్తే అంతా గందరగోళంగా తయారవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.