
హైదరాబాద్: పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లో సిరీస్లు ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని చెప్పాడు.
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్లో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు తరుపున ఆడేందుకు క్రిస్ గేల్ ఢాకాకు వచ్చాడు. ఈ సందర్భంగా "పాక్ క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా?" అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు క్రిస్ గేల్ తనదైన శైలిలో స్పందించాడు.
"పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటి. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. బంగ్లాదేశ్లో సైతం ఆటగాళ్లకు మంచి భద్రత లభిస్తుంది. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది?" అని క్రిస్ గేల్ అన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత శ్రీలంక జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఇటీవలే పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక ఆటగాళ్లకు పాక్ ప్రభుత్వం ఆదేశ అధ్యక్షుడిస్థాయి భద్రతను కల్పించింది. అయితే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను పాకిస్తాన్ 1-0 తేడాతో గెలుచుకుంది.