
తాము సరిగా ప్రదర్శన చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పెర్త్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీనిపై బాబర్ మాట్లాడారు. "బ్యాటింగ్లో మేము మార్కును అందుకోలేకపోయాము. మాకు మంచి బ్యాటర్లు ఉన్నారు కానీ పవర్ప్లేలో ఇద్దరు ఓపెనర్లు ఔట్ అయ్యారు. షాదాబ్, షాన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నప్పుడు, దురదృష్టవశాత్తూ షాదాబ్ అవుటయ్యాడు, ఆపై వరుసగా వికెట్లు తీయడం మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. మొదటి 6 ఓవర్లలో, మేము కొత్త బంతిని సరిగ్గా ఉపయోగించలేదు, కానీ మేము బంతిని బాగా ముగించాము. మా తప్పులపై చర్చిస్తాము" అని బాబర్ వివరించారు.
జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులుచేసింది. ఓపెనర్లు కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాధేవేరే 17 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ 19 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 19 పరుగులు చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్లు తీయగా.. ల్యూక్ జోంగ్వే, ముజారబానీని ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా సికిందర్ రజా 2022లో టీ20 మ్యాచ్ ల్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అతను 7 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్నాడు.