హైదరాబాద్: ప్రణాళికను అమలు చేయడంలో కొంచెం కూడా సఫలం కాలేకపోయామని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ టిమ్ పైనీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో మంగళవారం జరిగిన వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా దారణంగా విఫలమైంది.
దీంతో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియా భారీ ఓటమిపై కెప్టెన్ పైనీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "చిన్ననాటి నుంచే క్రికెట్ ఆడుతున్నాను. మంగళవారం నా జీవితంలో అత్యంత కఠినమైన రోజు. మా ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ వాళ్లు(ఇంగ్లండ్) మాపై సునాయాసంగా పైచేయి సాధించారు" అని అన్నాడు.
"మా మెడపై కత్తి పెట్టినంత పని చేశారు. ఈ రోజు ఆటలో మేము చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోయాం. మా ప్రణాళికను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఈ చెత్త ప్రదర్శన నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఓటమి కూడా ఒక్కోసారి మంచి చేస్తుంది. ఇదొక ఒక కనువిప్పు లాంటిది" అని పైనీ ఆవేదన వ్యక్తం చేశాడు.
టోర్నీలో భాగంగా జరగబోయే మగితా రెండు మ్యాచ్ల్లో తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ జట్టు మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే 5 వన్డేల సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.