|
జయవర్దనె సెంచరీ
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. వికెట్ కీపర్ కుమార సంగక్కర (48: 67 బంతుల్లో 5x4) పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివరలో తిసారా పెరీరా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్కి ఒక వికెట్ దక్కింది.
గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్
లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35: 49 బంతుల్లో 4x4) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ని మళ్లీ మ్యాచ్లోకి తెచ్చాడు. ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6)తో కలిసి గౌతీ (97: 122 బంతుల్లో 9x4)తో నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 223 వద్ద గంభీర్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ఫినిష్ చేసే బాధ్యత తీసుకున్న ధోనీ.. చివర్లో యువరాజ్ సింగ్ (21 నాటౌట్: 24 బంతుల్లో 2x4)తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
కెప్టెన్గా ధోనీ అరుదైన రికార్డు
ఎంఎస్ ధోనీ అనగానే వెంటనే గుర్తొచ్చేది టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011). వీటితో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో.. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడు ప్రతిష్టాత్మక టోర్నీలు భారత్ ఖాతాలో ఉన్నాయంటే మహీ అద్భుత కెప్టెన్సీనే అందుకు కారణం. ధోనీ ఇప్పటికీ బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు.
భావోద్వేగానికి గురైన సచిన్
వాంఖడేలో శ్రీలంకతో రవవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసి, ఆనంద డోలికల్లో తేలేలా చేసింది. ప్రతిఒక్కరికి ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ను భారత ఆటగాళ్లు భుజానెత్తుకొని వాంఖడే స్టేడియంలో ఊరేగించిన దృశ్యాలు అభిమానుల కళ్లలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. అప్పటివరకు సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో ప్రపంచకప్ అందుకోకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. టెండూల్కర్కు మహీ అంటే ఎంతో ఇష్టం.
IPL 2021: ఇది నట్టు కథ, మీ కథ.. మీది నట్టూదీ ఒకే కథ! నెట్టింట అలరిస్తున్న సన్రైజర్స్!!