కోహ్లీ చెలరేగాలి..
తొలి టెస్టులో భారత్ ప్రదర్శనను విశ్లేషిస్తే ఏ ఒక్కరూ గొప్పగా ఆడారని చెప్పడానికి లేదు. మయాంక్, రహానే కొంత ప్రతిఘటన కనబర్చినా అది ఏమాత్రం జట్టుకు ఉపయోగపడలేదు. ఇక కెప్టెన్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా తన ముద్ర చూపించలేకపోయిన విరాట్ ఇప్పుడైనా ఫినిషింగ్ టచ్ ఇస్తాడో లేదో చూడాలి.
శుభ్మన్కు నిరాశే..
ఆరో స్థానంలో విహారికి మరో అవకాశం లభించవచ్చు. ఇక బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ స్థానంలో జడేజాకు చోటు దక్కవచ్చు. అయితే ప్రాక్టీస్లో పృథ్వీ షా గాయపడటంతో ఈ టెస్టుకు ఓపెనింగ్ జోడీ మార్పు ఉంటుందని అందరూ భావించారు. కానీ కోచ్ రవిశాస్త్రి మాటలను చూస్తే పృథ్వీనే మయాంక్తో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. దీంతో శుభ్మన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. ఎన్నడూ లేని విధంగా విఫలమవుతున్న పుజారా కూడా భారీ ఇన్నింగ్స్ భాకీ ఉన్నాడు.
ఇషాంత్ ఔట్.. ఉమేశ్ ఇన్
పేసర్ ఇషాంత్ శర్మ మరోసారి గాయపడటంతో అతని స్థానంలో ఉమేశ్ తుది జట్టులోకి రానున్నాడు. తొలి టెస్ట్లో విఫలమైనా షమీ, బుమ్రా .. ఇషాంత్ లేని లోటును తీర్చాల్సిన అవసరం ఉంది. ఉమేశ్ యాదవ్తో కలిసి చెలరేగాల్సి ఉంది.
వాగ్నర్ వచ్చాడు!
భారీ విజయం తర్వాత న్యూజిలాండ్ మళ్లీ చెలరేగాలని పట్టుదలగా ఉంది. ఆ జట్టు బ్యాటింగ్ మెరుగ్గానే కనిపిస్తోంది. ఓపెనర్లు లాథమ్, బ్లన్డెల్ శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడో స్థానంలో విలియమ్సన్కు తిరుగు లేదు. రాస్ టేలర్ కూడా మిడిలార్డర్లో జట్టు భారం మోస్తున్నాడు. నికోలస్, వాట్లింగ్లతో జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో సౌతీ, బౌల్ట్ జోడి మరోసారి భారత్ను దెబ్బ తీసేందుకు సిద్ధమైంది.
వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్కు దూరమైన ప్రధాన పేసర్ నీల్ వాగ్నర్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఎవరి స్థానంలో అతడిని ఆడించాలనేది మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. తొలి టెస్టులో జేమీసన్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో కీలకం కాబట్టి ఆల్రౌండర్ గ్రాండ్హోమ్ను కూడా పక్కన పెట్టడం కష్టమే. అయితే గురువారంనాడు హాగ్లీ ఓవల్ పిచ్ పరిస్థితి చూస్తే పూర్తిగా పేసర్లకు అనుకూలించేలా కనిపిస్తోంది. అదే జరిగితే తొలి టెస్టులో కేవలం 6 ఓవర్లు వేసిన స్పిన్నర్ ఎజాజ్ పటేల్ స్థానంలో వాగ్నర్ను తీసుకొని నలుగురు పేసర్లతో కివీస్ బరిలోకి దిగవచ్చు.
పిచ్..
పూర్తిగా పచ్చికతో కప్పబడిన హాగ్లీ ఓవల్ మైదానం పిచ్ పేస్కు అనుకూలించనుంది. దీంతో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్లు తొలుత ఫీల్డింగ్ తీసుకోనున్నాయి. స్వింగ్, బౌన్స్కు అనుకూలంగా ఉంటే ఈ పిచ్పై ప్రారంభంలో బ్యాటింగ్ చేయడం కష్టం. కుదురుకుంటేనే పరుగులు రాబట్టవచ్చు. మ్యాచ్కు వర్ష సూచనలేదు. ఉదయం 4 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు(అంచనా)
భారత్: పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), జడేజా/అశ్విన్, ఉమేశ్ యాదవ్, షమీ, బుమ్రా
న్యూజిలాండ్: టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, వాట్లింగ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, టిమ్ సౌథీ, కైల్ జేమీసన్, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్