హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి కోహ్లీ తన కెరీర్లో 23వ టెస్టు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
వన్డేల్లో 35 సెంచరీలను కలుపుకుని విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 58కి చేరుకుంది. ఇంగ్లీషు గడ్డపై ఇంగ్లాండ్ లాంటి ప్రత్యర్థిపై అదీ మూడు టెస్టుల వ్యవధిలో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించడంతో కొందరు అతడిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో పోల్సుతున్నారు. ఇలా పోల్చడం సరికాదని తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ అన్నాడు.
"సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక తేవడం సరికాదని నా భావన. ఒకవేళ సచిన్ సాధించిన 100 శతకాల రికార్డుని కోహ్లీ అందుకోగలిగితే అప్పుడు పోలికకి విలువ ఉంటుంది. విరాట్ కోహ్లీనే కాదు.. ప్రతి క్రికెటర్ కూడా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డుని అందుకోవాలని ఆశపడుతున్నారు. అయితే అందరి కంటే కోహ్లీ కొంచెం ముందున్నాడు. అతనిలో క్రికెట్లోని మైలురాళ్లని అందుకోవాలని తపన కనిపిస్తోంది" అని సెహ్వాగ్ అన్నాడు.
తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో మొత్తం 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు సాధించగా 463 వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.