'గంగూలీ.. ధోనీ కాదు కుంబ్లేనే నా కెప్టెన్'

ముంబై: ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ నుంచి వీడ్కోలు పలికాడు గౌతం గంభీర్. విజయంతో ముగించాలనుకున్న కెరీర్కు తప్పని పరిస్థితుల్లో రాజీనామా ప్రకటిస్తున్నందుకు సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వెల్లగక్కాడు. తను జట్టులో ఉండగా టీమిండియాకు చాలా మంది కెప్టెన్లుగా వచ్చారు. కానీ, వీరిలో తనకంటూ ప్రత్యేకంగా నచ్చేది ఒక్కరేనంటూ గౌతీ చెప్పుకొచ్చాడు.

విశ్వాసం కోల్పోయిన జట్టుకు దాదా
ప్రపంచ టాప్ జట్లలో ఒక్కటిగా నిలిచిన టీమిండియా.. క్రికెట్ చరిత్రలో ఎంతోమంది కెప్టెన్లు.. తమదైన ముద్ర వేసి భారత్ను విజయవంతంగా నడిపించారు. వారిలో ఈ తరం గుర్తుంచుకొనే నాయకులైన సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో డీలాపడి విశ్వాసం కోల్పోయిన జట్టుకు దాదా ఆశలు చిగురించేలా చేశాడు. అత్యుత్తమ జట్టును తయారు చేసుకున్నాడు. యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ.. భారత్ను ముందుకు నడిపించాడు.

అత్యుత్తమ జట్టుతో.. దనాదన్ ధోనీ
గంగూలీ తర్వాత అదే స్థాయిలో ప్రభావం చూపిన వ్యక్తి ధోనీ. అత్యుత్తమ జట్టును తయారు చేసింది గంగూలీ అయితే దానితో విజయాలు సాధించాడు దనాదన్ ధోనీ. తనకు ఇష్టమైన కెప్టెన్ మాత్రం వీరిద్దరూ కాదంటున్నాడు గంభీర్. తనకిష్టమైన నాయకుడు అనిల్ కుంబ్లే అని చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ వదిలేసినప్పుడు 2007 నుంచి ఏడాది కాలం జంబో టీమిండియాకు నాయకత్వం వహించాడు.

స్వార్ధం లేని, నీతిపరుడైన వ్యక్తి నాయకత్వంలో
‘కెప్టెన్కీ నాయకుడికీ తేడా ఉంటుంది. నా కెరీర్లో చాలా మంది కెప్టెన్ల ఆధ్వర్యంలో జట్టులో ఆడాను. కేవలం స్వార్ధం లేని, నీతిపరుడైన వ్యక్తి నాయకత్వంలో చాలా నేర్చుకున్నా. నేనెప్పుడూ జట్టులాగే కెప్టెన్ బాగుండాలని చెప్తాను. కానీ మంచి నాయకుడంటే మాత్రం అనిల్ కుంబ్లేనే. అతడి కెప్టెన్సీలో కేవలం ఐదు టెస్టులే ఆడినా చాలానే నేర్చుకున్నా. '

కెప్టెన్ లక్షణాలన్నీ ఆయన వద్దే
‘శ్రీలంకలో పునరాగమనం చేశా. సొంతగడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడా. నాయకత్వ లక్షణాలన్నీ ఆయన వద్దే నేర్చుకున్నా. నిస్వార్ధంగా ఉండటం, అభిరుచితో ఆడటం, తన క్రికెట్పై నీతిగా ఉండటం చూశాను. అందుకే నా దృష్టిలో ఆయనే అత్యుత్తమ నాయకుడు' అని గంభీర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications