మొదలైన ఫిరోజ్ షా కోట్లాలోనే
దూకుడైన ఓపెనర్గా పేరున్న ఈ ఢిల్లీ బ్యాట్స్మన్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో భారత టాప్ స్కోరర్గా నిలిచాడు. ధోని నేతృత్వంలో భారత్ ఈ రెండు కప్పులూ గెలిచిన సంగతి తెలిసిందే. గంభీర్ భారత్ తరపున 58 టెస్ట్లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ‘ఆంధ్రతో ఢిల్లీ ఆడబోయే తర్వాతి రంజీ మ్యాచే నా కెరీర్లో ఆఖరిది. నా కెరీర్ మొదలైన ఫిరోజ్ షా కోట్లాలోనే నా ప్రస్ధానం ముగియనుంది' అని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో గంభీర్ తెలిపాడు.
|
రిటైర్మెంట్ గురించి కొంతకాలంగా
‘రిటైర్మెంట్ ఆలోచన కొంతకాలంగా నన్ను వెంటాడుతోంది. చికాకు పరిచే అదనపు సరంజామాగా విమానాల్లోనూ నాతో ప్రయాణించింది. నాతోపాటు సాధనకూ వచ్చింది. నన్ను వెక్కిరిస్తూనే ఉంది' అంటూ తాను ఎలా రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చాడో చెప్పాడు. క్రికెటర్గా వచ్చే జన్మలో కూడా ఇప్పటిలాగే బాధలు, భయాలు, వైఫల్యాలు చూడాలనుకుంటున్నానని తెలిపాడు.
నా కథ ఎవరో రాసేస్తున్నారు
రెండు ప్రపంచకప్ ఫైనల్స్లో టాప్ స్కోరర్గా నిలవడం తన కెరీర్లోనే అత్యుత్తమ దశలని చెప్పాడు. ‘ఎవరో నా కథ రాస్తున్నారనేది నా భావన. ఐతే ఇప్పుడు సిరా అయిపోయింది. కానీ ఈ క్రమంలో కొన్ని మనోహరమైన అధ్యాయాలు రాశాడు. న్యూజిలాండ్లో సిరీస్ విజయం, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్ విజయం నా కథలో మధుర అధ్యాయాలే' అని గంభీర్ అన్నాడు.
రిటైర్మెంట్కు కారణం అదేనా
సుదీర్ఘ కెరీర్లో తనకు సహకరించిన కోచ్లు, సహచరులు, కుటుంబ సభ్యులకు వీడియోలో అతడు కృతజ్ఞతలు తెలిపాడు.గంభీర్ చివరిసారి 2016లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. భారత్ జట్టుకు దూరమైనా.. ఐపీఎల్లో తనదైన ఆటతీరుతో గంభీర్ ఆకట్టుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్ వహించిన గౌతీ.. ఆ జట్టుకు 2సార్లు కప్పు అందించాడు. అయితే.. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన గంభీర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే గంభీర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.
పదివేల పరుగులు పూర్తిచేసుకున్న జాబితాలో
2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్ దిగ్విజయంగా సాగింది. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. భారత జట్టులోకి పునరాగమనం కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్ కూడా ఒకడు కావడం విశేషం. 2007 టీ20 ఫైనల్, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. రెండింట్లోనూ గౌతం టాప్ స్కోరర్ కావడం మరో విశేషం.