
హైదరాబాద్: ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో పాకిస్థాన్కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్కు చేరుకుంది.
పాక్పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించడం పట్ల సెహ్వాగ్ ట్విట్టర్లో స్పందించాడు. "ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అభిమానులు కోరుకున్నట్టుగా జరగలేదు. ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాక్ తలపడతాయని చాలా మంది ఊహించారు. కానీ అలా జరగలేదు. ఈరోజు బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. ముష్ఫికర్, మిథున్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, మెహిదీ సత్తా చాటారు. పాక్కు అదృష్టం కలిసిరాలేదు" అని ట్వీట్ చేశాడు.
శుక్రవారం జరిగే టైటిల్ ఫైట్లో భారత్తో తలపడనుంది. మొత్తం 6 జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. శ్రీలంక, హాంకాంగ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
వన్డేల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు 34సార్లు తలపడగా... టీమిండియా 28సార్లు బంగ్లాదేశ్పై విజయం సాధించిగా, బంగ్లాదేశ్ 5 సార్లు... ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. శుక్రవారం నాటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే ఏడోసారి ఆసియా కప్ను కైవసం చేసుకుంటుంది.
ఇక, ఆసియాకప్లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో పాక్ పూర్తిగా విఫలమైందని అన్నాడు. కుర్రాళ్లతో కూడిన జట్టు గత టోర్నీలో బాగా ఆడిందని, దీంతో అంచనాలు పెరిగాయని చెప్పాడు. పాక్ జట్టు పుంజుకోవాలంటే ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించాడు.