దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. చైర్మన్ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియను ఖరారు చేసే ఏకైక ఎజెండాతో సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. చైర్మన్ ఎన్నికలపై ఎటూతేల్చలేకపోయారు.
దాంతో చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. 17 మంది సభ్యులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వెల్లడించారు. 'చాలా అంశాల్లో ఏకాభిప్రాయం లేదు. 17 మంది సభ్యుల సాధారణ మెజారిటీ లేదా 2/3 మెజారిటీ కోసం ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. అందుకే ఏకగ్రీవంగా ఎన్నుకొబడే వ్యక్తినే చైర్మన్గా కొనసాగించాలని అనుకున్నాం. ఎన్నికల వల్ల వచ్చే ఒత్తిడిని మేం తట్టుకోలేం. మెంబర్స్ మధ్య బేధాభిప్రాయాలు వస్తాయి'అని ఐసీసీ బోర్డు మెంబర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఇంతవరకు లభించకపోవడం, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బరిలోకి దిగడంపై స్పష్టత ఇవ్వకపోవడం, పీసీబీ చీఫ్ ఎహ్సాన్ మణి కూడా పోటీకి వెనకడుగు వేయడంతో కొత్త అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత కరువైంది.
అయితే ఈ పదవిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొలిన్ గ్రేవ్స్ (ఇంగ్లండ్), డేవ్ కామెరాన్ (వెస్టిండీస్)లకు కొందరినుంచి మద్దతు లభిస్తున్నా... వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య కూడా అలాగే ఉంది. చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తే సభ్య దేశాల మధ్య అనవసరపు భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని... అలా జరగకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోందనేది సమాచారం. భారత్కు చెంది కేఎస్ అనంతపద్మనాభన్ను అంతర్జాతీయ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్లోకి తీసుకున్నారు.
యుజ్వేంద్ర చహల్కు కాబోయే సతీమణి ధనశ్రీ గురించి తెలుసా?!!