హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పాల్గొంటాడా? లేదా అనే విషయం సోమవారం తెలియనుంది. ఐపీఎల్లో షమీ పాల్గొనే అంశం అవినీతి నిరోధక యూనిట్(ఏసీయూ) ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో షమీతో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షమీని బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టు నుంచి తప్పించింది. పోలీసులు కేసు నమోదు చేసిన మహమ్మద్ షమీని ఐపీఎల్ క్యాంప్లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది.
క్రికెటర్ షమీ కేసులో మరో మలుపు: బీసీసీఐ సాయం తీసుకోనున్న భార్య
ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ న్యాయసలహా కమిటీని ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం కోరింది. షమీని ఐపీఎల్లోకి అనుమతించాలా వద్దా? అనే విషయమై ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, సీఈఓ రాహుల్ జోహ్రీ, సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ కూడా హాజరుకానున్నారు.
ఈ సమావేశంపై బీసీసీఐ ఉన్నతాధికారి మాట్లాడుతూ 'ఈ విషయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్లో ఆడుతోన్న అందరు ఆటగాళ్ల ఒప్పందంలో బీసీసీఐ, ప్రాంఛైజీ, ఆటగాడి పాత్ర ఉంటుంది. అవును, షమీ విషయం సున్నతమైన అంశం కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోలేం. దీనిపై టాప్ బీసీసీఐ అఫీసియర్స్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని అన్నారు.
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ 'ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్ షమీపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఏసీయూకు ఏడు రోజుల సమయం ఇచ్చాం. నీరజ్ నివేదిక సమర్పించిన తరువాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. అంతిమ నిర్ణయం పాలకుల కమిటీ(సీఓఏ) తీసుకుంటుందని' ఖన్నా చెప్పారు
మరోవైపు షమీపై అతడి భార్య నమోదు చేసిన కేసుకు సంబంధించి డాక్యుమెంట్లతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐ సీఈఓ వినోద్ రాయ్కు పంపినట్లు ఆమె వెల్లడించింది. 'గురువారం కోల్కతా పోలీస్ స్టేషన్లో షమిపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన కాపీని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్కి పంపించాం' అని జకీర్ చెప్పారు.
షమీ భార్య చేసిన ఆరోపణలపై దృష్టి సారించిన సీఓఏ దీనిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్ నీరజ్ కుమార్ను ఆదేశించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో షమీని వేలంలో ఢిల్లీ రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన సంగత తెలిసిందే. ఏది అయితేనేం ఈ వివాదంతో షమీ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారనుంది.