దాదా ఔటైతే ఏడ్చేవాడిని
తాజాగా క్రిక్బజ్తో నితీశ్ రాణా మాట్లాడుతూ... 'చిన్నప్పుడు భారత్ మ్యాచ్లు జరుగుతుంటే ఇంట్లో గొడవలు జరిగేవి. నా సోదరుడు రాహుల్ ద్రవిడ్ అభిమాని. నేను సౌరవ్ గంగూలీకి అభిమానిని. ఇక మా నాన్న సచిన్ టెండూల్కర్కు వీరాభిమాని. గంగూలీ ఔటైన ప్రతీసారి మా నాన్న ఏదో అనేవారు. దాంతో నేను కోపంగా గదిలోకెళ్లి తలుపులు వేసుకొని వెక్కివెక్కి ఏడ్చేవాడిని. ఇక అమ్మకు ఏం చేయాలో అర్ధం కాకపోయేది' అని తన చిన్ననాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్ ఆడతానని అనుకోలేదు
'నేనెప్పుడూ ఐపీఎల్ ఆడతానని అనుకోలేదు. నాలుగైదు సీజన్ల పాటు నాకిష్టమైన అక్షయ్కుమార్ (నటుడు), వీరేందర్ సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, గౌతమ్ గంభీర్ లాంటి స్టార్లను చూడటానికి అరుణ్జైట్లీ స్టేడియంకు వెళ్లేవాడిని. అప్పుడు వాళ్లంతా డిల్లీ జట్టుతో ఉండేవారు. వారిని దగ్గర్నుండి చూసి ఎంతో ఆనందపడేవాడిని. ఇక సెహ్వాగ్ ఆట చూసి గంతులేసేవాడిని. అయితే అప్పుడు నేనొక విషయం అనుకునేవాడిని. ఎవరైనా ఈ ఆటగాళ్ల మ్యాచ్ చూడకపోతే.. ఇక వాళ్లు ఏదీ చూసి ఉండరని భావించేవాడిని' అని నితీశ్ రాణా చెప్పాడు.
అప్పుడు నేను నమ్మలేదు
'నేను రంజీల్లో ఆడేటప్పుడు మంచి ప్రదర్శన చేయడంతో ఏదో ఒక ఐపీఎల్ జట్టు తీసుకుంటుందని భావించా. ఒక మ్యాచ్ ఆడుతుండగా.. డ్రింక్స్ సమయంలో నా స్నేహితుడొచ్చి ముంబై ఇండియన్స్కు ఎంపికయ్యానని చెప్పాడు. అప్పుడు నేను నమ్మలేదు. జోక్ చేస్తున్నాడనుకున్నా. తర్వాత నిజమేనని చెప్పడంతో చాలా సంతోషించా. ఆ సమయంలో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి' అని రాణా పేర్కొన్నాడు.
సచిన్ గుర్తించడం ఎప్పటికీ ప్రత్యేకమే
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనని తొలిసారి గుర్తించడం ఎప్పటికీ ప్రత్యేకమని నితీశ్ రాణా చెప్పాడు. తాను ముంబై ఇండియన్స్కు ఆడుతున్నప్పుడు ఒకసారి సచిన్.. జట్టు మేనేజర్తో ఎవరీ కుర్రాడని వాకబు చేశాడని, అది తన స్నేహితుడు చూశాడని చెప్పాడు. సచిన్ తనని తొలిసారి గుర్తించడంతో.. సరైన మార్గంలోనే వెళ్తున్నాననే నమ్మకం కలిగిందన్నాడు. అప్పటి ముంబై కోచ్ రికీ పాంటింగ్ తనకు విలువైన సూచనలు చేశాడని, అవి తన కెరీర్ను మార్చిందని వివరించాడు. రాణా 2016, 2017 సీజన్లలో ముంబై ఇండియన్స్కు ఆడిన సంగతి తెలిసిందే. ఆపై 2018లో కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది.