షమీ మాయ.. చెలరేగిన హిట్మ్యాన్.. సూపర్ ఓవర్లో భారత్ ఘన విజయం!!

హామిల్టన్: ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా హామిల్టన్లోని సెడాన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఫలితాన్ని 'సూపర్ ఓవర్' తేల్చింది. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ నిర్దేశించిన 18 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా సాధించడంతో.. మూడో టీ20లో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది టీమిండియాకు అనూహ్య విజయం అందించాడు. అంతకముందు చివరి ఓవర్లో పేసర్ మొహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ 'టై' అయింది.

చెలరేగిన రోహిత్:
ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆరంభం నుండే పరుగుల వరద పారించాడు. లోకేష్ రాహుల్ అండతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పేసర్ హామిష్ బెన్నెట్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. టీ20 కెరీర్లో రోహిత్కిది 20వ హాఫ్సెంచరీ.

రాణించిన కోహ్లీ:
ఇక జట్టు స్కోరు 89 వద్ద రాహుల్ (27) పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లలోనే 80 పరుగులకు పైగా చేసిన టీమిండియా.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ నెమ్మదించింది. శివమ్ దూబే (3) నిరాశపరిచాడు. ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కోహ్లీ కూడా 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ (17) కూడా నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ చివరలో మనీష్ పాండే (14 నాటౌట్), రవీంద్ర జడేజా (10 నాటౌట్) స్కోర్ బోర్డును 179 పరుగులకు తీసుకెళ్లారు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ మూడు వికెట్లు తీసాడు.

విలియమ్సన్ వీరోచిత ఇన్నింగ్స్:
180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా గప్తిల్ (31) ధాటిగా ఆడాడు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కివీస్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. ఈ సమయంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్ (95; 48 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు) ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓటమి తప్పదనే దశలో విలియమ్సన్ ఒంటరి పోరుతో న్యూజిలాండ్ను రేసులోకి తీసుకొచ్చాడు.

చివరి ఓవర్లో షమీ మాయ:
ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కివీస్ విజయానికి 9 బంతుల్లో 6 పరుగులు అవసరం. షమీ వేసిన తొలి బంతికే టేలర్ సిక్సర్ బాదడంతో కివీస్ గెలుపు ఖాయం అనుకున్నారు. తర్వాతి బంతికి టేలర్ సింగిల్ తీసి.. విలియమ్సన్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. మూడో బంతికి కేన్.. రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. నాలుగో బంతికి సీఫర్ట్ పరుగులేమీ చేయలేదు. ఐదో బంతిని కనీసం బ్యాట్కు కూడా తాకించలేదు. అయితే బైస్ రూపంలో సింగిల్ తీశారు. దీంతో మ్యాచ్ టై అయింది. కివీస్ విజయానికి ఒక పరుగు కావడంతో.. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న టేలర్ బంతిని వికెట్ల మీదకు ఆడుకోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

హిట్మ్యాన్ వరుస సిక్సులు:
మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (1,1,6,4,1,4) 17 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్ చేసాడు. విలియమ్సన్ (11), గప్తిల్ (5) పరుగులు చేసారు. ఒక పరుగు బైస్ రూపంలో వచ్చింది. అనంతరం ఛేదనలో రోహిత్ (15) భారీ సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా గెలుపొందింది. రాహుల్ (5) పరుగులు చేసాడు. సౌథీ బౌలింగ్ చేసాడు.

న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర:
మ్యాచ్ (65), సూపర్ ఓవర్ (15)లో అద్భుతంగా ఆడిన హిట్మ్యాన్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. తాజా విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంకో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ గెలుపుతో చరిత్ర సృష్టించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications