దుబాయ్: అభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని అసలు తగ్గించుకోవద్దని పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ అంటుంన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 సెమీ ఫైనల్లో కీలక సమయంలో మాథ్యూ వేడ్ ఆడిన షాట్ను క్యాచ్ అందుకునే క్రమంలో అలీ జారవిడిచిన సంగతి తెలిసిందే. అనంతరం వేడ్ వరుసగా మూడు సిక్సులు బాది ఆస్ట్రేలియాకు సునాయాస విజయాన్ని అందించాడు. దీంతో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన పాకిస్థాన్ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే పాక్ అభిమానులు హసన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వల్లే పాక్ జట్టు ఓడిపోయిందని సోషల్ మీడియాలో మండిపడ్డారు. దీనిపై తాజాగా స్పందించిన హసన్ ట్విటర్లో ఆసక్తికర పోస్టు చేశాడు.
'నా ప్రదర్శనతో మీరంతా నిరాశచెందారని నాకు తెలుసు. మీ అంచనాలను అందుకోలేకపోయా. కానీ మీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డా. నామీద మీకున్న నమ్మకాన్ని అసలు తగ్గించుకోకండి. వీలైనంత మేర పాకిస్థాన్ క్రికెట్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే అనుకుంటున్నా. అందుకోసం మళ్లీ కష్టపడి సాధన చేస్తా. ఈ సంఘటన నన్ను మరింత ద్రుఢంగా చేస్తుంది. ఈ సమయంలో నాకు అండగా నిలిచి మెసేజ్లు, ట్వీట్లు, ఫోన్లు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని హసన్ అలీ భావోద్వేగంగా ఓ ట్వీట్ చేశాడు.
సెమీ ఫైనల్ మ్యాచ్లో చివరివరకూ పాకిస్థాన్ జట్టే గెలిచేలా కనిపించింది. చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా విజయానికి 22 పరుగులు అవసరమైన వేళ షహీన్ అఫ్రిది 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అప్పుడు వేడ్ ఆడిన ఒక షాట్ను హసన్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి కిందపడి ఆసీస్ బ్యాట్స్మన్ బతికిపోయాడు. తర్వాత అతడు వరుసగా మూడు సిక్సులు బాది ఆసీస్ను గెలిపించాడు. అంతకుముందు హసన్ తన బౌలింగ్లో 44 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో పాక్ అభిమానులు పెద్ద ఎత్తున అతడిపై మండిపడ్డారు.