ఢాకా: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో న్యూజిలాండ్ పర్యటన వాయిదా పడింది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్ వాయిదా పడింది. టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఆగస్టు-సెప్టెంబర్ మధ్య రెండు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు బంగ్లాకు రావాల్సి ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో సిరీస్ వాయిదా వేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం నిర్ణయించింది. న్యూజిలాండ్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తజతో పాటు ప్లేయర్లు నజుముల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
'వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టులో సిరీస్కు ఆతిథ్యమివ్వడం చాలా సవాల్తో కూడుకున్న విషయం. సిరీస్ నిర్వహణ చాలా కష్టం. ఆటగాళ్లు, సిబ్బంది, మిగిలిన వారి ఆరోగ్యం విషయంలో మేం ఏ మాత్రం రాజీపడలేం. అందుకే న్యూజిలాండ్ బోర్డుతో చర్చలు జరిపి సిరీస్ను వాయిదా వేస్తున్నాం. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు న్యూజిలాండ్ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని నిజాముద్దీన్ చౌదరీ ప్రకటించారు.
వాయిదా వల్ల క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడుతారని తెలిసినా తమ మాట మీద సిరీస్ను వాయిదా వేసేందుకు న్యూజిలాండ్ బోర్డు ఒప్పుకుందని చౌదరి పేర్కొన్నారు. కాగా ఈ నెలలో ఆస్ట్రేలియా బంగ్లాకు రావాల్సి ఉన్నా.. ఆ సిరీస్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక జూలైలో శ్రీలంకకు బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉన్నా.. ఈ పర్యటన కూడా అనుమానంగానే మారింది. ఇప్పటికే భారత్-శ్రీలంక, భారత్-జింబాబ్వే పర్యటనలను బీసీసీఐ వాయిదా వేసింది.
అయితే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టెస్టు సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టు జులై 8న ప్రారంభం కానుంది. సోమవారంతో ఇంగ్లాండ్లో విండీస్ క్రికెట్ బృందం 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేసుకుంది. దీంతో టెస్టు సిరీస్కు సన్నాహాకంగా మాంచెస్టర్లో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ను ఆడనుంది.
ధోనీ లేకపోతే కోహ్లీ కెరీర్ ముగిసేదే: గంభీర్