ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అన్నంత కసితో ఆడతాడు:
'క్రికెట్ కనెక్టెడ్'లో ఫుట్బాల్ను ఉదాహరణగా పేర్కొన్న నాజర్ హుస్సేన్.. విజయం కోసం విరాట్ కోహ్లీ ఎంతలా పరితపిస్తాడో తెలిపాడు. 'గతంలో భారత క్రికెట్ జట్టు ఫుట్బాల్ మ్యాచ్ సరదాగా ఆడుతుంటే చూశా. జట్టంతా సరదాగా ఆడుతుంటే.. కోహ్లీ మాత్రం ఫుట్బాల్ ప్రపంచకప్ అన్నట్లుగా ఆడాడు. అది కోహ్లీ పరుగుల ఆకలి. విజయం సాధించాలనే కాంక్ష అని నా అభిప్రాయం. అయితే ఆ కసిని అతను క్రికెట్లోనూ చూపిస్తాడు కాబట్టే ఛేదనలో విజయవంతం అవుతున్నాడు' అని నాజర్ అన్నాడు.
వ్యక్తిగత రికార్డులు పట్టించుకోడు:
'ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ గెలుపు మీదే దృష్టి పెడతాడు. వ్యక్తిగత రికార్డులను, గణాంకాలను అతడు పట్టించుకోడు. భారత జట్టు మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్ తొలిసారి కోహ్లీని చూసినప్పుడు.. 'అతనిలో పోరాట యోధుడు కనిపిస్తున్నాడు. అతనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది' అని నాకు చెప్పాడు. కోహ్లీ లాగే ఇతరులకు సామర్థ్యం, డబ్బులు ఉండొచ్చు. కానీ.. అతను ఓ విజేత. అదే అతనికి ఇతరులకు ఉన్న తేడా' అని హుస్సేన్ పేర్కొన్నాడు.
ఆటపై కోహ్లీ ఎంతో తీవ్రత చూపిస్తాడు:
అదే కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా విరాట్ కోహ్లీని కొనియాడారు. 'దిగ్గజం కపిల్ దేవ్ సారథ్యంలో ఆడాను. కపిల్, కోహ్లీని పోల్చగలను. కోహ్లీలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది' అని శ్రీకాంత్ అన్నాడు. 'ఆటపై కోహ్లీ ఎంతో తీవ్రత చూపిస్తాడు. అతడిలో గొప్పతనం అదే. అదే నాకు ఇష్టం. కోహ్లీ తన తీవ్రతను ఇప్పటికీ అలానే కొనసాగించడం ప్రశంసనీయం' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఎదో ఒక సమయంలో కోహ్లీ తన తీవ్రతను కోల్పోతాడనుకున్నా, కానీ ఇప్పటికీ అలానే ఉన్నాడు అని ప్రశంసల్లో ముంచెత్తాడు.
కరోనా కట్టడికి 3 కోట్లు:
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సరదా సమయం గడుపుతున్నాడు. కరోనా కట్టడి కోసం విరుష్క దంపతులు 3 కోట్ల రూపాయలు సాయం అందించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసుల సేవలను గుర్తిస్తూ కోహ్లీ ఓ వీడియోలో మాట్లాడాడు. 'ఈ విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న పోలీసులు ఎంతో మందికి సాయమందిస్తున్నారని తెలిసి.. నా మనసు తరుక్కుపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల సేవలు గుర్తించాలనుకుంటున్నా. వారు ఎంతో నిబద్ధతతో తమ విధులు నిర్వర్తించడమే కాకుండా అనేక మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాగే కొనసాగించండ' అని కోహ్లీ అన్నాడు.