మధ్యప్రదేశ్కు చెందిన మాజీ లెగ్ స్పిన్నర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) స్పిన్ కోచ్ నరేంద్ర హిర్వానీ భారత మహిళా జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా వ్యవహరించనున్నారు. భారత్ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడిన హిర్వానీ సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్తో మహిళా జట్టుతో కలవనున్నారు.
ఎందరు పోటీపడ్డా.. హెడ్ కోచ్గా రవిశాస్త్రికే మళ్లీ అవకాశం?
ప్రస్తుతం భారత మహిళా జట్టులో చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు. పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, దీప్తి శర్మలతో జట్టు స్పిన్నర్లతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్పిన్ కోచ్ అవసరం అని తాజాగా భారత టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అన్నారు. ఇది పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ నరేంద్ర హిర్వానీని స్పిన్ కన్సల్టెంట్గా ఎంపిక చేసింది.
'జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో హిర్వానీ బిజీగా ఉండడంతో పూర్తి సమయం మహిళా జట్టుతో ఉండలేడు. అయితే జట్టుతో పాటు ప్రయాణిస్తాడు. పురుషుల జట్టు మాదిరిగానే మహిళా జట్టుకు అంకితమైన సహాయక సిబ్బంది ఉండాలి' అని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. భారత జట్టు గత మార్చి నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. చాలా విరామం తరువాత సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల హోమ్ సిరీస్లో తలపడనుంది. ఆడిన చివరి ఆరు టీ20లను కోల్పోయిన మహిళా జట్టు.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు ప్రారంభించింది.
లెగ్ స్పిన్నర్ హిర్వానీ 1988లో చెన్నై వేదికగా జరిగిన వెస్టిండీస్తో మ్యాచ్లో టెస్ట్ అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్లో ఎనిమిది చొప్పున (8/61, 8/75) పదహారు వికెట్లు తీశాడు. గతంలో బాబ్ మస్సీ పేరిట ఉన్న 8/137పరుగుల రికార్డును అరంగ్రేట మ్యాచ్తోనే చెరిపేశాడు. వన్డేల్లో భారత్ తరఫున వరుసగా మాడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి ఆటగాడు నరేంద్ర హిర్వానీ.