చెన్నై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ 'యాంటీ ఇండియన్' అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ అన్నారు. ఐసీసీ ఛైర్మన్గా శశాంక్ మనోహర్ తప్పుకోవడం భారత క్రికెట్కు శుభపరిణామని పేర్కొన్నారు. శశాంక్ భారత క్రికెట్కు ఎంతో చేటు చేశాడని, అతను తప్పుకోడంతో బీసీసీఐతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ సంతోషిస్తారు అని శ్రీనివాసన్ చెప్పారు.
ఎన్ శ్రీనివాసన్ గురువారం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ శశాంక్ మనోహర్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. 'నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే.. శశాంక్ భారత క్రికెట్కు అతనెంతో చేటు చేశాడు. ఐసీసీ పదవి నుంచి తప్పుకోవడంతో బీసీసీతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ సంతోషిస్తారు. నాకు తెలిసి భాధపడేవారు ఎవరూ ఉండరు. బీసీసీఐతో పాటు ప్రపంచ క్రికెట్కు ఆర్థికంగా ఎంతో నష్టం చేకూర్చాడు. ఐసీసీలో మన (బీసీసీఐ) ప్రాధాన్యం తగ్గించాడు. అతనో యాంటీ ఇండియన్' అని అన్నారు.
'శశాంక్ మనోహర్కు మరోసారి ఐసీసీ ఛైర్మన్గా ఉండే అవకాశం ఉంది. అయినా అతడు పారిపోయాడు. ఎందుకంటే.. బీసీసీఐ నుంచి మద్దతు దొరకదని అర్థం అయింది. గతేడాది బీసీసీఐలో కొత్త పాలక వర్గం ఎన్నికయ్యాక అతని ఆటలు సాగవని తెలిసి ముందుగానే దుకాణం ఎత్తేశాడు' అని ఎన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నాటి నుంచీ బీసీసీఐకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఆదాయంలో భారత వాటాల్ని తగ్గించాడు.
శ్రీనివాసన్ ఐసీసీ ఛైర్మన్గా ఉన్నప్పుడు బిగ్-త్రీ పద్ధతిని ప్రవేశపెట్టినా.. శశాంక్ ఆ పదవిలోకి వచ్చాక దాన్ని తొలగించాడు. దీంతో ఐసీసీలో భారత్ ఆర్థికంగా నష్టపోయింది. అలాగే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్పైనా తుది నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నాడు. మరోవైపు ఐసీసీతో బీసీసీఐకి రెండు మేజర్ టోర్నీల (భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్)కు సంబంధించి పన్ను మినహాయింపు వివాదం నడుస్తోంది. ఈ సమస్యలన్నీ తొలగి ఐసీసీలో మళ్లీ బీసీసీఐ చక్రం తిప్పాలంటే సౌరవ్ గంగూలీ లాంటి వ్యక్తి ఆ పెద్ద పోస్టులోకి రావాలని భారత క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి శశాంక్ మనోహర్ తప్పుకొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఐసీసీ బుధవారం వెల్లడించింది. చైర్మన్ పదవికి మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖజా నిర్వహిస్తారని ఐసీసీ వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆరంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈసీబీ మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీలో ఉన్నారు.
మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్, న్యూజిలాండ్ నుంచి గ్రెగర్ బార్క్లే, దక్షిణాఫ్రికా తరఫున క్రిస్ నెన్జాని కూడా చైర్మన్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కోలిన్ గ్రేవ్స్, సౌరవ్ గంగూలీలలో ఒకరు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవరైనా సరే ఏకగ్రీవం కోసమే ప్రయత్నించే అవకాశముంది. ఇప్పటికైతే గంగూలీ అభ్యర్థిత్వం గురించి బీసీసీఐ ఎక్కడా చెప్పలేదు. అనూహ్య పరిణామాలు జరిగితే గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉండడం ఖాయం.
విదేశాల్లో ఐపీఎల్ 2020.. ఆతిథ్య రేసులో ఆ రెండు దేశాలు!!