బాడీకి దూరంగా విసురుతా అని వాగ్దానం చేశాడు:
స్మృతి మంధాన యూట్యూబ్ చానల్తో మాట్లాడుతూ గతంలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్లో గాయపడ్డానని తెలిపింది. 'అప్పట్లో షమీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండగా.. నేను అతన్ని కలిశా. ఆ సమయంలో షమీ భయ్యా నెమ్మదిగానే బౌలింగ్ చేస్తానని నాతో చెప్పాడు. 120 కిమీ వేగంతో బాడీకి దూరంగా విసురుతా అని వాగ్దానం చేశాడు. అప్పటికి నేను పేస్కు అలవాటుపడకపోవడంతో మొదటి రెండు బంతులను ఎదుర్కోవడంలో విఫలమయ్యా. ఇక్కడ షమీ ఆ రెండు బంతులు బాగానే వేశాడు' అని మంధాన తెలిపింది.
దెబ్బకు 10 రోజులు వాపు వచ్చింది:
'షమీ విసిరిన మూడో బంతి మాత్రం అనూహ్యంగా దూసుకొచ్చి నా థై ప్యాడ్ వద్ద బలంగా తాకింది. దీంతో నాకు దెబ్బ తగిలింది. దెబ్బకు పది రోజుల పాటు తొడ వద్ద వాపు వచ్చింది. నలుపు, నీలం, ఆకుపచ్చగా మారి 10 రోజులు అలానే ఉంది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో నొప్పి తగ్గింది' అని స్మృతి మంధాన పేర్కొంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తాను నెట్ సెషన్లలో షమీ బౌలింగ్లో గాయపడ్డా అని చెప్పాడు. షమీ గ్రీన్ పిచ్పై ప్రమాదకారి అని పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కూడా కష్టమే అని చెప్పుకొచ్చాడు.
హృతిక్ అంటే పిచ్చి:
ఇటీవల ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ స్మృతి' అంటూ సాగిన సంభాషణలో 23 ఏళ్ల ఈ లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇష్టమైన అబ్బాయి ఎవరని అడిగితే.. 'చిన్నప్పట్నుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చచ్చేంత పిచ్చి అని స్మృతి చెప్పింది. ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిందా అని అడిగితే.. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లాడతానని తెలిపింది. 'మీరెంతో అందంగా ఉంటారు కదా. మరి సినిమాల్లో కథానాయికగా నటిస్తారా' అని ఓ అభిమాని అడగ్గా... 'నేను నటిస్తే ఆ సినిమా చూసేందుకు ఎవ్వరూ థియేటర్లకు రారు. మీరు నా నుంచి అలాంటివి ఆశించకండి' అని బదులిచ్చింది.
ప్రపంచకప్లో విఫలం:
2018లో అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా బీసీసీఐ గుర్తింపు పొందిన స్మృతి మంధాన.. ఆఖరుగా మహిళల టీ20 ప్రపంచకప్ పోటీల్లో కనిపించింది. దీనిలో నాలుగు మ్యాచ్లలో పాల్గొన్న స్మృతి కేవలం 49 పరుగుల్ని మాత్రమే సాధించగలిగింది. స్మృతితో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా విఫలమవడంతో కప్ చేజారింది.