ఐపీఎల్ తర్వాతే:
తాజాగా డివిలియర్స్ మాట్లాడుతూ... 'వచ్చే రోజులలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్పైనే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నా సర్వశక్తుల మేరకు పోరాడతా. తర్వాత ఈ ఏడాదిలో ఏంచేయాలనే దాని గురించి ఆలోచిస్తా. టీ20 ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు' అని తెలిపాడు. 2018లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
క్రమశిక్షణ ఎంతో కీలకం:
'ప్రతి ఆటగాడు తన పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. నా భార్య, కుమారుల కోసం సమయాన్ని వెచ్చించే స్థితికి చేరుకున్నా. క్రికెట్కు, కుటుంబానికి మధ్య సమతుల్యత ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుత రోజుల్లో ప్రముఖ ఆటగాళ్లకు మానసిక, శారీరక ఒత్తిడి భారీగా ఉంది. అయితే ఏం చేయాలో, ఏం చేయకూడదనేది వారే నిర్ణయించుకోవాలి. క్రమశిక్షణ అనేది ఎంతో కీలకం. రోజూ వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద కష్టంగా అనిపించదు' అని డివిలియర్స్ అన్నాడు.
2018లో క్రికెట్కు వీడ్కోలు:
ఏబీ డివిలియర్స్ 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ తరహా లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్కు అవసరమైతే అందుబాటులో ఉంటానని ఏబీ డివిలియర్స్ చెప్పగా.. సెలక్టర్లు అందుకు అంగీకరించలేదు. అప్పటి కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ కూడా ఏబీ పునరాగమనం కోసం బాగానే ప్రయతించాడు. అయితే అప్పటికే సెలక్టర్లు జట్టుపై ఓ అంచనాకి రావడంతో ఏమీ చేయలేకపోయాడు.
టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఏదైనా చేయాలి:
తాజాగా జాంటీ రోడ్స్ ఓ స్పోర్ట్స్ ఛానెల్లో మాట్లాడుతూ... 'నేను ఏబీ డివిలియర్స్కు పెద్ద అభిమానిని. ముందు ఏం జరిగిందో నాకైతే పూర్తిగా తెలియదు. దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఏదైనా చేయాలి. ఐపీఎల్లో ఏబీ ఎలా ఆడతాడోనని చాలామంది ఎదురుచూస్తున్నారు. బిగ్బాష్లో తన క్లాస్ చూపించాడు' అని అన్నారు.