బెంగళూరుపై ముంబై 46 పరుగుల తేడాతో విజయం
ఇదిలా ఉంటే సొంతగడ్డపై మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై అలవోక విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20ఓవర్లలో 167/8 స్కోరుకే పరిమితమైంది.
కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్
కెప్టెన్ కోహ్లీ(62 బంతుల్లో 92 నాటౌట్, 7ఫోర్లు, 4సిక్స్లు) మినహా ఎవరూ రాణించలేదు. డివిలీయర్స్(1), అండర్సన్(0), మణ్దీప్సింగ్(16), సుందర్(7) నిరాశపరిచారు. కృనాల్ పాండ్యా(3/28), మెక్క్లీగన్(2/24), బుమ్రా(2/28) ధాటికి బెంగళూరు ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది.
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి రోహిత్శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ప్రారంభ ఓవర్లోనే పేసర్ ఉమేశ్ యాదవ్ సంచలన బౌలింగ్తో షాకిచ్చాడు. తొలి రెండు బంతులకు సూర్యకుమార్, ఇషాన్ బౌల్డ్ అవడంతో మూడో బంతికే కెప్టెన్ రోహిత్ క్రీజులోకి రావాల్సి వచ్చింది. 2011లో ప్రవీణ్ కుమార్ కూడా ఇలాగే రెండు వికెట్లు తీశాడు.
ఐపీఎల్లో ఎవిన్ లూయిస్ తొలి హాఫ్ సెంచరీ
అయితే బెంగళూరుకు ఈ సంతోషం తొలి ఓవర్ వరకే పరిమితమైంది. ఆ తర్వాత లూయిస్, రోహిత్ మెరుపు ఇన్నింగ్స్తో వారికి బెంగ తప్పలేదు. ముఖ్యంగా లూయిస్ బౌండరీల వర్షంతో ఆరంభం నుంచే రన్రేట్ను పదికి తగ్గకుండా చూశాడు. ఇదే జోరుతో 32 బంతుల్లో ఓ భారీ సిక్సర్తో అతడు ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 11వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో అలరించినా తర్వాత ఓవర్లో అండర్సన్కు చిక్కాడు.
మూడో వికెట్కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం
దీంతో మూడో వికెట్కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇక్కడి నుంచి రోహిత్ శ్మ హవా మొదలైంది. 15వ ఓవర్లో వరుసగా 6,4తో అతడు 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో హార్దిక్ కీపర్ క్యాచ్ను అంపైర్ ఔగా ప్రకటించినా రివ్యూలో నాటౌట్గా తేలింది. ఆ తర్వాత వరుస బంతుల్లో తను రెండు సిక్సర్లు బాదాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి
అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో వరుసగా 4,6,4తో హోరెత్తించి మరో బంతి మిగిలి ఉండగా ఔటయ్యాడు. ఇక చివరి బంతిని హార్దిక్ పాండ్యా (5 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 17 నాటౌట్) ఫోర్గా మలిచాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 70 పరుగులు రాబట్టింది.