
హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్కప్ 12వ ఎడిషన్ ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడింది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు కూడా ఆహ్వానించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరల్డ్కప్ భాగంగా మిగతా జట్లు తమ తమ మ్యాచ్ల కోసం సన్నద్దమవుతున్నాయి. అయితే, ఆటగాళ్లను ఒత్తిడి నుంచి తప్పించేందుకు ఐసీసీ ప్రత్యేకంగా పలువురి ఆటగాళ్లను ఇంటర్యూ చేస్తోంది. మొన్న ఓపెనర్ రోహిత్ శర్మను ఇంటర్యూ చేయగా... తాజాగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఇంటర్యూ చేసింది.
ఇందులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కొన్ని సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. టీమిండియాలో ఏ ఆటగాడు జిమ్లో ఎక్కువ సమయం గడుపుతాడు? ఎవరు ఎక్కువ సెల్ఫీలను ఇష్టపడతారు? జట్టులోని సహచర ఆటగాళ్లలో చెత్త డ్యాన్సర్ ఎవరు? లాంటి ప్రశ్నలకు జడేజా సరదాగా సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్లో పంచుకుంది.
మరోవైపు టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన అక్కడికి చేరుకుంది. గురువారం పలువురు ఆటగాళ్లు నెట్లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
కాగా, ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్తో పాటు కోహ్లీసేన సైతం పటిష్టంగా ఉంది.