కాంట్రాక్ట్ లిస్టులో దక్కని చోటు:
తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా.. అందులోనూ ధోనీకి కాంట్రాక్ట్ని ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న తరుణంలో మహీ పేరు కాంట్రాక్ట్ లిస్టులో లేకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.
రంజీ జట్టుతో ప్రాక్టీస్:
అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ వైట్బాల్తో ఎక్కువగా ప్రాక్టీస్ చేసాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు. అయితే ఝార్ఖండ్లోని ప్రసిద్ధ దేవాలయం 'డియోరి'లో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టినట్లు సమాచారం తెలుస్తోంది.
రీఎంట్రీ కోసమేనా?:
ఇటీవలే ధోనీ డియోరి దేవాలయంకు వెళ్లి పూజలు చేసాడట. ప్రస్తుతం ధోనీ ప్రత్యేక పూజలకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన మహీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వచ్చే సీజన్లో మెరుగ్గా రాణించి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ ఆశిస్తున్నాడని అతని అభిమానులు అంటున్నారు. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్లో రాణిస్తే.. టీ20 ప్రపంచకప్ కోసం ధోనీ ఎంపికని పరిశీలిస్తామని ఇటీవల టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్న విషయం తేగలిసిందే. దీంతో ఐపీఎల్కి ధోనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
2011లో మొదటిసారి ప్రత్యేక పూజలు:
2011 వన్డే ప్రపంచకప్ ముందు కూడా 'డియోరి' దేవాలయంలో ధోనీ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ధోనీ అదే ఆలయంలో పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ధోనీ ప్రస్తుతం కెరీర్లోనే అత్యంత సంక్లిష్ట దశని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ అతడి భవిష్యత్తును తేల్చనుంది.
2021 ఐపీఎల్ మహీ ఆడుతాడు:
మహీ ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ స్పష్టం చేసాడు. 'ధోనీ 2020 ఐపీఎల్ ఆడుతాడు. 2020 ఐపీఎల్తో పాటు 20021 ఐపీఎల్లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా.. మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్ తెలిపాడు.