
హైదరాబాద్: ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల బోర్డుల్లో బీసీసీఐ సంపన్నమైన బోర్డు. అలాంటి బీసీసీఐకి చెందిన బీసీసీఐ.టీవి అధికార వెబ్సైట్లో ఓ తప్పు దొర్లింది. బీసీసీఐ.టీవీ అధికారిక వెబ్సైట్ ప్రకారం టీమిండియా కెప్టెన్ ఎవరో తెలుసా? మహేంద్ర సింగ్ ధోని.
అదేంటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కదా. అవును, 2017లో కెప్టెన్నీ నుంచి ధోని తప్పుకోవడంతో బీసీసీఐ ఆ పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పజెప్పింది. ప్రస్తుతం భారత్ తరుపున మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, బీసీసీఐ.టీవీ వెబ్సైట్లో ధోని ప్రొపైల్ కింద ఇంకా కెప్టెన్గానే కనిపిస్తోంది. కెప్టెన్నీకి ధోని రాజీనామా చేసి రెండేళ్ల అయినా వెబ్సైట్ ఇంకా అప్డేట్ చేయకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో జోకులు సైతం వేస్తున్నారు.
కాగా, బీసీసీఐ టీమిండియాకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. కెప్టెన్గా భారత జట్టుని ఓ స్థాయిలో నిలబెట్టాడు. అంతేకాదు ఐసీసీ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీల్లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని ఒక్కడే.
2009లో టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానంలో నిలిపాడు. 2016లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఆసీస్ గడ్డపై వైట్ వాష్ చేసింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనినే. కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు.
ఈ పర్యటనలో భాగంగా వన్డేల్లో ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు అతి తక్కవ ఇన్నింగ్స్లో ఈ క్లబ్లో చేరిన క్రికెటర్ల సరసన ధోనీ నిలిచాడు. 51.5 యావరేజ్తో ఈ మైలురాయిని ధోని సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్, గంగూలీ, ద్రవిడ్ తర్వాత పదివేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్గా ధోనీ ఘనత సాధించాడు.
ఈ ఘనతను ధోనీ 273 ఇన్నింగ్స్లో సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లో పదివేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఈ ఫీట్ని 259 ఇన్నింగ్స్లో సాధించగా.. ఆ తర్వాత స్థానంలో 263 ఇన్నింగ్స్తో గంగూలీ, 266 ఇన్నింగ్స్తో రికీ పాంటింగ్, 272 ఇన్నింగ్స్తో జాక్వెస్ కలీస్, ఆ తర్వాతి స్థానంలో 273 ఇన్నింగ్స్తో ధోని నిలిచాడు.