
హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ వల్లే భారత్ ఓటమి పాలైందని ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిదాహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 23 బంతుల్లో కేవలం 23 పరుగులే చేశాడు.

చివరి ఓవర్లో రిషబ్ పంత్ దూకుడుగా ఆడకపోవడంతో ఆతిథ్య జట్టుకు 175 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో 9 బంతుల మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. కుషల్ పెరీరా 37 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
'రిషబ్ పంత్ ఆడకపోతే ఎంత మంది సంతోషంగా ఉన్నారో. ఇది నిజంగా అద్భుతం. ప్రపంచమంతా నీ అద్భుత ప్రదర్శన కోసం ఎదురు చూస్తే నిరాశ పరిచావు అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్లో ఈ రోజు యువ ఆటగాడు రిషబ్ పంత్కు మరో నేర్చుకునే రోజుగానే మిగిలిపోయింది' అని ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే ట్వీట్ చేశాడు.
రిషబ్ పంత్ ఆటతీరుపై ధోని అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పంత్ నీ ఇష్టం వచ్చినట్లు ఆడటానికి ఇది ఐపీఎల్' కాదని ఒకరంటే పంత్లా ధోని ఆడితే ఇప్పటికే రిటైర్మెంట్ కావాలనే కామెంట్లు పోస్టు చేసేవారని ఇంకొకరు స్పందించారు. 'పంత్ వల్లే మ్యాచ్ ఓడిపోయింది. అతను తన ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి' అని మరికొందరు ట్రోల్ చేశారు.