|
మైదానంలోకి ధోనీ:
టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రాంచీ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. ఎంఎస్ ధోనీ స్వస్థలం రాంచీ కాబట్టి.. తొలి రోజే మ్యాచ్కు హాజరవుతాడని అందరూ ఊహించారు. కానీ.. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంకు వచ్చాడు. ధోనీ రాగానే మైదానం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఫాన్స్ ధోనీ.. ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
|
నదీమ్తో ప్రత్యేకంగా ముచ్చటించిన ధోనీ:
బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక ధోనీ టీమిండియా డ్రస్సింగ్ రూమ్కు చేరుకున్నాడు. అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు సభ్యులతో చాలా సమయం గడిపాడు. అందరితో మాట్లాడాడు. ఇక భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఝార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్తో ధోనీ ప్రత్యేకంగా ముచ్చటించాడు. రవిశాస్త్రితో కలిసి ధోనీ ఫొటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబందించిన పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
|
ధోనీ మా గెస్ట్:
రాంచీ మ్యాచ్ ముగిసింది, ధోనీ ఇంటికి వెళతారా అని మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా.. 'ధోనీ మా గెస్ట్. ఈ రోజు ధోనీనే ఇక్కడకు వచ్చి ఆటగాళ్లను కలిసాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడు. హలో చెప్పండి' అని తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ ఏమైనా మాట్లాడాడా అని అడగ్గా.. కోహ్లీ నవ్వేసాడు. 'ధోనీ భవిష్యత్తు గురించి గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు' అని పేర్కొన్నాడు.
సొంత అడ్డాలో దిగ్గజాన్ని చూడటం బాగుంది:
'అద్భుత సిరీస్ విజయం తర్వాత తన సొంత అడ్డాలో టీమిండియా దిగ్గజాన్ని చూడటం ఎంతో బాగుంది' అని ధోనీని ఉద్దేశించి రవిశాస్త్రి ట్వీటాడు. ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు కూడా అందుబాటులో లేడు. నవంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.