హైదరాబాద్: 2020లో జరిగే వరల్డ్ కప్లో ఆడే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉందని మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ధోని విఫలం కావడంతో టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు సూచించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆశిష్ నెహ్రా స్పందించాడు. తాను జట్టుకి ఉపయోగపడని ధోని భావిస్తే నిజాయతీగా వీడ్కోలు చెప్పేస్తాడని నెహ్రా వెల్లడించాడు. కేవలం ఒకటి లేదా రెండు సిరీస్ల గణాంకాలు ఆధారంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోమని చెప్పడం ఎంత మాత్రం సరికాదని నెహ్రా అభిప్రాపయపడ్డాడు.
'ప్రతి ఇంటికి ఒకరు పెద్ద కావాలి. అలానే జట్టులో ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. నా అంచనా ప్రకారం మరో రెండు లేదా మూడేళ్లు శరీరం సహకరిస్తే అతను క్రికెట్ ఆడతాడు. ఒకవేళ అతను జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే నిజాయతీగా పక్కకి తప్పుకుంటాడు' అని నెహ్రా అన్నాడు.
'కానీ.. ప్రస్తుతం అతడ్ని స్వేచ్ఛగా ఆట ఆస్వాదించనివ్వండి. ఎందుకంటే అతను దేశం కోసం ఏ త్యాగానికైన వెనకాడబోడు. నా అంచనా ప్రకారం ధోని కచ్చితంగా 2020 టీ20 ప్రపంచకప్ కూడా ఆడతాడు. 39 ఏళ్ల వయసు వచ్చే వరకూ నాలాంటి ఒక ఫాస్ట్ బౌలర్ క్రికెట్ ఆడగా లేనిది. ఇప్పటికీ మంచి ఫిటెనెస్తో ఉన్న ధోనీ టీ20, వన్డేలు ఆడేందుకు అర్హుడే' అని నెహ్రా అన్నాడు.
ఇదిలా ఉంటే ధోనిపై వచ్చిన వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మద్దతుగా నిలిచాడు. 'ధోనిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్మెన్గా నేను మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు 35 సంవత్సరాలు కాదు కాబట్టి' అని కోహ్లీ తెలిపాడు.
'ధోని ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాడు. ఫిట్నెస్పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ముగిసిన సిరీస్లో ధోని బ్యాట్తో రాణించాడు' అని ధోనికి మద్దతుగా కోహ్లీ నిలిచాడు.
'ఈ సిరీస్లో అతనికి ఎక్కువ సమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ధోని మాత్రమే కాదు ఈ సిరీస్లో హార్దిక్ పాండ్యా కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరు. ఒక్క ధోనిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు' అని కోహ్లీ అన్నాడు.
'ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి రన్ రేట్ 8.5-9.5 మధ్యలో ఉంది. వికెట్ కూడా అనుకూలించలేదు. వికెట్ కూడా కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పటిలా లేదు. టాపార్డర్లో వచ్చేవాళ్లు లోయర్ ఆర్డర్లో వచ్చేవాళ్ల కంటే ఈజీగా బాల్ను బౌండరీకి తరలించగలరు. మ్యాచ్ గడుస్తున్నకొద్దీ పిచ్ మందగించడం మన కండిషన్స్లో సాధారణం' అని కోహ్లీ అన్నాడు.
'ధోని చాలా బాగా ఆడుతున్నాడు. కష్టపడుతున్నాడు. అయితే అది ప్రతి మ్యాచ్లో కనిపించదు. అతను ఢిల్లీలో ఒక్క సిక్స్ కొడితే మ్యాచ్ తర్వాత పదిసార్లు చూపించారు. ఒక్క మ్యాచ్లో ఫెయిలవగానే అతని వెంట పడుతున్నాం. ధోని ఏంటో అతనికి బాగా తెలుసని, అతని గురించి అతనే నిర్ణయం తీసుకుంటాడు తప్ప మిగితా ఎవరికీ హక్కు లేదు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.