అదే మమ్మల్ని వేధిస్తోంది:
పాకిస్థాన్ ప్రదర్శనపై తాజాగా కోచ్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. 'యాషిర్ ఫా, అబ్బాస్ ప్రధాన బౌలర్లు. అజార్ కీలక బ్యాట్స్మన్. అందరూ విఫలమయ్యారు. వారి ఫామ్ జట్టుపై ప్రభావితం చూపుతుంది. బౌలింగ్లో కూడా ఎంతో బలహీనంగా ఉన్నాం. ఆసీస్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాం. ఈ సమస్య ఎప్పుడూ మమ్మల్ని వేధిస్తుంది' అని మిస్బా అన్నాడు.
పాక్ భవిష్యత్తుపై దృష్టి సారిస్తాం:
'ఆసీస్ పిచ్లపై సత్తా చాటాలంటే ఇక్కడి పరిస్థితుల్ని బట్టి బౌలింగ్, బ్యాటింగ్లో అప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలి. మ్యాచ్ గెలవాలంటే ఇక్కడ క్రీజులో ఉండి భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంటుంది. ఆసీస్ వారి సొంత మైదానాల్లో మా కంటే ఎంతో బలమైన జట్టు. పాక్ భవిష్యత్తుపై దృష్టి సారిస్తాం' అని మిస్బా తెలిపాడు. ఈ పర్యటనలో పాక్ ఒక్క విజయం కూడా సాధించలేదు. మూడు టీ20ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది.
సానుకూలాంశాలను పరిగణలోకి తీసుకుంటాం:
పాక్ కెప్టెన్ అజర్ అలీ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా జట్టును అభినందించాలి. డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడు. మేము టాప్ జట్టు చేతిలో ఓడిపోయాం. అయితే అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమయ్యాం. టెస్టు మ్యాచ్లు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. ఆసీస్లో 20 వికెట్లు తీయాలంటే ఎంతో సాధన అవసరం. ఆటలో పైచేయి సాధించడం చాలా ముఖ్యం. రెండు టెస్టుల్లో అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. అయితే మేం సానుకూలాంశాలను పరిగణలోకి తీసుకుంటాం' అని చెప్పుకొచ్చాడు.
అక్రమ్ అసంతృప్తి:
పాకిస్థాన్ ఫీల్డింగ్పై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. నిద్ర మత్తులో ఫీల్డింగ్ చేస్తున్నారా అని మండిపడ్డాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం పాక్ ఆటతీరు మరి దారుణంగా ఉందని పేర్కొన్నాడు. డిసెంబర్ 11 నుంచి పాక్ స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది.