మెల్బోర్న్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన వన్డే ప్రపంచకప్పై కరోనా వైరస్ మహమ్మరి ప్రభావం ఉండకపోవచ్చని, షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరుగుతుందని భావిస్తున్నామని ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ అభిప్రాయపడ్డారు. మెగాటోర్నీ బరిలోకి దిగే ముందు తక్కువ సమయమే దొరికినా.. పూర్తిగా సంసిద్ధమవుతామన్న నమ్మకం ఉందని ఆమె తెలిపారు. 28 ఏళ్ల లానింగ్ ఆసీస్ తరపున 4 టెస్టులు, 80 వన్డేలు, 104 టీ20లు ఆడారు. వన్డేల్లో 13, టీ20ల్లో 2 సెంచరీలు బాదారు.
కాస్త సిగ్గు తెచ్చుకోండి.. పాక్ క్రికెటర్లకు ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్!!
గురువారం ఆస్ట్రేలియా క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగ్ లానింగ్ మాట్లాడుతూ... 'వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకారమే వన్డే ప్రపంచకప్ జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. అందుకోసం మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఓ జట్టుగా మేమంతా ఎంతో కాలం కలిసి ఆడుతున్నాం. అందుకే ప్రాక్టీస్ చేసేందుకు కొంత కాలం లభించినా.. ప్రపంచకప్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవగలం. ఆ విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు' అని తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆపై కొద్ది రోజులకే కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. 'లాక్డౌన్ వల్ల ఏర్పడిన విరామం జట్టు ప్రదర్శనపై పెద్దగా ప్రభావం చూపించదు. అదే దూకుడు కొనసాగిస్తామన్న నమ్మకం ఉంది. అదృష్టవశాత్తూ మేము ఆడిన పెద్ద టోర్నమెంట్ టీ20 ప్రపంచకప్. ఇది ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. లాక్డౌన్ కారణంగా ఇంట్లో సమయం గడుపుతున్నా. ఇపుడు ఇంట్లో అన్ని పనులను చేసే అవకాశం వచ్చింది. గత ఎనమిది వారాలుగా బ్యాట్ పట్టలేదు. ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం మాత్రం వ్యాయామం చేస్తున్నా ' అని లానింగ్ చెప్పారు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత్తో ఎంసీజీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 85 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదోసారి కప్పును ముద్దాడింది. ఆసీస్ ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎలీసా చెలరేగి ఆడింది. అనంతరం ఛేదనలో ఆసీస్ బౌలర్లు మేఘన్ షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) భారత మహిళలను ఓ ఆటాడుకున్నారు.