వెక్కివెక్కి ఏడ్చా
తాజాగా స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ... '2007లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో నేను ఫామ్లో ఉన్నాను. మంచి లయ అందుకున్నాను. మ్యాచుకు ఒకరోజు ముందు ఫీల్డింగ్ చేస్తుండగా.. భుజానికి గాయం అయింది. దాంతో తుది జట్టులో చోటుదక్కలేదు. టెస్ట్ అరంగేట్రం చేయలేకపోయా. ఆ రోజు హోటల్ గదికి వెళ్లి గట్టిగా అరిచాను. వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాను' అని తెలిపాడు. 2006-07 సీజన్లో తివారీ బెంగాల్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు.కేవలం ఏడు మ్యాచ్ల్లో 796 పరుగులు చేశాడు. ఆ సీజన్లో రాబిన్ ఉతప్ప (854 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ మనోజ్ తివారీనే. మూడు సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు.
ఖాళీ ఉన్నా.. ఆడే అవకాశం ఇవ్వలేదు:
'2011-2012లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మన్కు ఒక ఖాళీ కూడా ఉంది. టీమ్ మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే.. తప్పకుండా ఇచ్చేది. కానీ వారు అలా భావించలేదు. నన్ను పరిగణించలేదు' అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. తివారీ టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
సెంచరీ చేశాక కూడా:
'సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం సుస్థిరం అనే అనిపిస్తుంది. అయితే నాకు మాత్రం ఆ విధంగా జరగలేదు. సెంచరీ చేశాక కూడా నన్ను ఏకంగా 14 మ్యాచ్ల పాటు బెంచ్కే పరిమితం చేయడం షాక్కు గురిచేసింది' అని బెంగాల్ బ్యాట్స్మన్ మనోజ్ తివారీ వెల్లడించాడు. ఆసీస్ పర్యటన కంటే ముందు వెస్టిండీస్తో భారత్ వన్డే సిరీస్ ఆడింది. అందులో భాగంగా జరిగిన ఐదో వన్డేలో తివారి శతకం (104) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో భారత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రపంచకప్లో గంగూలీ పాత్ర కూడా:
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మనోజ్ తివారి ప్రశంసలతో ముంచెత్తాడు. 2011 ప్రపంచకప్ను భారత చేజిక్కించుకోవడంలో గంగూలీ పాత్ర కూడా ఉందన్నాడు. గంగూలీ సారథిగా ఉన్నప్పుడే ప్రపంచకప్ను గెలిచేలా యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్లతో కూడిన జట్టును తయారు చేశాడన్నాడు. వారిని 2011 ప్రపంచకప్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు.
కోహ్లీ-అనుష్క గొడవ పడితే.. మొదటగా ఎవరు క్షమాపణ అడుగుతారో తెలుసా?!!