సమగ్ర సమాచారం సేకరిస్తాడు
తాజాగా మహేలా జయవర్ధనే సోనీస్పోర్ట్స్తో మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ పట్టుదల గల కెప్టెన్. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ఓ కెప్టెన్గా ప్రత్యర్థులకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరిస్తాడు. అదే అతడి బలమని నేను భావిస్తున్నా. అలా సేకరించిన సమాచారాన్ని మైదానంలో కచ్చితంగా ప్రయోగిస్తాడు. ఆ విషయంలో మంచి నేర్పరి' అని జయవర్ధనే పేర్కొన్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా నాలుగు, ఆటగాడిగా ఐదు ట్రోఫీలు అందుకున్న ఏకైక ఆటగాడు రోహిత్ మాత్రమే. మొత్తం 104 మ్యాచ్లకు రోహిత్ నాయకత్వం వహించగా.. 60 విజయాలు ముంబై జట్టుకి అందించాడు. అతడి విజయాల శాతం 58.65తో మెరుగ్గా ఉంది.
ఒత్తిడిలో మ్యాచ్లు ఆడటం బాగా తెలుసు
రోహిత్ శర్మ సక్సెస్కు గల కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గతంలోనే తెలిపాడు. రోహిత్ శర్మకు ఒత్తిడిలో మ్యాచ్లు ఆడటం బాగా తెలుసని, అదే అతని సక్సెస్కు కారణమన్నాడు. '2008లో డెక్కన్ చార్జర్స్ విజయాల్లో రోహిత్ ముఖ్య భూమిక పోషించాడు. ఆ సమయంలోనే జట్టుకు సారథ్యం వహించే లక్షణాలు అలవర్చుకున్నాడు. అప్పుడు రోహిత్ ఓ యువ క్రికెటర్ మాత్రమే. కేవలం టీ20 ప్రపంచకప్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. అయినా మా ప్రతీ విజయంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. తన ఆత్మవిశ్వాసాన్ని క్రమేపి పెంచుకుంటూ ముందుకు సాగాడు. జట్టు సమావేశాల్లో విజయాల కోసం తన వాయిస్ను కూడా వినిపించేవాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేవాడు' అని లక్ష్మణ్ చెప్పాడు.
స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా
'హిట్మ్యాన్' రోహిత్ శర్మ తన బ్యాటింగ్ విజయ సూత్రాన్ని గతంలో వెల్లడించాడు. 'దీర్ఘకాలిక లక్ష్యాలు పెద్దగా ఫలితాలివ్వవని నా సుదీర్ఘ కెరీర్ ద్వారా అర్థమైంది. అంతేకాదు వాటివల్ల ఒత్తిడి కూడా ఏర్పడుతుందని గ్రహించా. అందుకే నేను ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా. ఎప్పుడూ రెండు, మూడు నెలల్లో జరిగే కొన్ని మ్యాచ్లను దృష్టిలో పెట్టుకునే సన్నద్ధమవుతుంటా. మనం ఎవరితో ఆడతాం, నేను అత్యుత్తమంగా ఏం చేయగలను అని ఆలోచిస్తా. ప్రతి సిరీస్ లేదా టోర్నమెంట్ కోసం లక్ష్యాలను పెట్టుకోవడం నాకు చాలా సాయం చేస్తున్నది. ఈ విధానం ఎంతో ఉత్తమం, ఉపయుక్తంగా కూడా ఉంటుంది' అని హిట్మ్యాన్ తెలిపాడు.
ఐపీఎల్ నిరవధిక వాయిదా
ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ కరోనా వైరస్ కారణంగా నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టతా లేకపోయినా.. ఒకవేళ అక్టోబర్-నవంబర్లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ మాత్రం తన నిర్ణయాన్ని వాయిదా వేయడం గమనార్హం.