
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా జరుగుతోన్న రాజస్థాన్, బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ లో బెంగుళూరు జట్టు గ్రీన్ దుస్తుల్లో కనిపించింది. ఈ రంగును సీజన్ మొత్తంలో ఏదో ఒక మ్యాచ్ లో ధరించాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్ కు ధరించి సిద్ధమైంది. సామాజిక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ వినూత్నంగా బరిలోకి దిగింది. ఆరంభం నుంచి ఎరుపు, నలుపు కాంబినేషన్లో ఉన్న జెర్సీతో మ్యాచ్లు ఆడుతున్న ఆర్సీబీ ఆదివారం గ్రీన్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టింది.
పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు, అభిమానులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆర్సీబీ యాజమాన్యం గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తోంది. సొంతగడ్డపై జరిగే ఏదో ఒక మ్యాచ్లో ఇలా కొన్నేళ్లుగా ఆడుతూ వస్తోంది. దీనిలో భాగంగా టాస్ వేసే సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రహానెకు విరాట్ కోహ్లీ ఒక మొక్కను కూడా బహూకరించడం విశేషం.
2011 ఐపీఎల్ సీజన్ నుంచి గ్రీన్ జెర్సీని ధరించి 'గో గ్రీన్' కార్యక్రమం పేరుతో గ్లోబల్ వార్మింగ్పై అవగాహన కల్పించేందుకు ప్రతియేటా ఆర్సీబీ ఫ్రాంఛైజీ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఫీల్డర్లు చురుకుగా కదులుతూ.. పరుగులు అదుపు చేసే క్రమంలో బెంగుళూరు జట్టు కనిపిస్తోంది. బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. బౌలర్లు కాస్త పనితనం చూపించాల్సి ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే.. సంజు శాంసన్ ఐపీఎల్ లో ఆడటం ఇదే మొదటిసారి. అయినా సిక్సర్ల వర్షం కురిపించి హాఫ్ సెంచరీని దాటేశాడు. రాజస్థాన్ జట్టు 18 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.