
న్యూ ఢిల్లీ: దాయాది దేశాల మధ్య మ్యాచ్లో వింత సంఘటనలు చోటు చేసుకోవడం షరా మామూలే. కొందరు తమ జట్టే గెలవాలని ఎంతకైనా సిద్ధపడుతుంటే మరి కొందరేమో స్నేహభావంతో కలుపుగోలుతో ముందుకొస్తుంటారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా.. క్రికెట్ రెండు దేశాల అభిమానులను దగ్గర చేస్తుంది. గతంలోనూ చాలాసార్లు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో క్రికెట్ సిరీస్లు వాటిని తగ్గించే ప్రయత్నం చేశాయి.
తాజాగా మరోసారి ఆసియాకప్లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఓ పాక్ అభిమాని చేసిన పని రెండు దేశాల ప్రజలను ఆకట్టుకుంటుంది. టీమిండియాకు వీరాభిమాని అయిన సుధీర్ గౌతమ్ ఆసియాకప్ మ్యాచ్లు చూడటానికి పాక్ క్రికెట్కు అభిమాని మొహమ్మద్ బషీర్ సాయపడ్డాడు. ఇండియన్ టీమ్ ఆడే ప్రతి మ్యాచ్లో ఒంటికి త్రివర్ణ పతాకంలోని రంగులను వేసుకొని వచ్చే అభిమాని మీకు తెలిసే ఉంటాడు.
సచిన్కు వీరాభిమాని అయిన సుధీర్.. టెండూల్కర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మిస్ టు టెండూల్కర్ అని ఒంటిపై రాసుకొని మ్యాచ్లకు వస్తున్నాడు. అయితే ఈసారి యూఏఈ వెళ్లి ఆసియాకప్ చూడటానికి డబ్బులు లేకపోవడంతో సుధీర్ టోర్నీకి వెళ్లలేకపోతున్నానని చింతించాడు. ఈ విషయం తెలుసుకున్న పాక్ హార్డ్కోర్ ఫ్యాన్ మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా షికాగో.. సుధీర్ టూర్కి అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని చెప్పాడు.
'ఇక్కడికి వచ్చేసెయ్.. అన్నీ నేను చూసుకుంటాను. అంత గొప్పవాన్ని కాకపోయినా.. నా మనసు మాత్రం సముద్రమంత పెద్దది. ఇలా సాయం చేస్తే అల్లా సంతోషిస్తాడు' అని సుధీర్తో తాను చెప్పినట్లు చాచా షికాగో చెప్పాడు. గతంలోనూ ఈ ఇద్దరు అభిమానులు కొన్ని మ్యాచుల్లో కలిశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ను కూడా ఈ ఇద్దరూ కలిసి చూడనున్నారు.