పోప్కు తుది జట్టులో ఆడేందుకు అవకాశం
స్పిన్నర్లను ఎదుర్కొని చక్కగా బౌలింగ్ చేయగలుగుతున్నాడని పరిగణించిన ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పోప్కు తుది జట్టులో ఆడేందుకు అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలో.. పోప్ అరంగేట్రం గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కోహ్లీ పైవిధంగా స్పందించాడు.
కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని ఘటన
‘ఈ సందర్భంగా పోప్కు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. జాతీయ జట్టుకు ఆడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నీ కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని ఘటన ఇది. అందుకే ఈ మ్యాచ్ను బాగా ఎంజాయ్ చేయ్. అంతేకానీ, ఎక్కువ పరుగులు చేయాలని మాత్రం అనుకోకు. పోప్ బ్యాటింగ్ను ఇప్పటివరకు చూడలేదు. ఒకవేళ అతడికి తుది జట్టులో చోటు దక్కితే అదృష్టంగా భావించాలి' అని కోహ్లీ అన్నాడు. లార్డ్స్ వేదికగా భారత్తో జరిగే రెండో టెస్టులో పోప్ ఆడతాడని ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
2 ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ 7 వికెట్లు
తొలి టెస్టులో ఆడిన మలన్, స్టోక్స్పై వేటు వేసిన ఇంగ్లాండ్ వారి స్థానంలో పోప్, వోక్స్ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. లార్డ్స్ టెస్టులో అతడ్ని నిలువరించాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగానే.. జట్టు నుంచి డేవిడ్ మలాన్ని తప్పించి యువ క్రికెటర్ ఒలీ పోప్ని తీసుకుంది. ఇటీవల ఫస్ట్క్లాస్ క్రికెటర్ పోప్ అద్భుతంగా ఆడి సూపర్ ఫామ్లో ఉన్నాడు.
లార్డ్స్లో అశ్విన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
ముఖ్యంగా.. స్పిన్నర్లని ఆడటంలో ఈ 20 ఏళ్ల హిట్టర్ ప్రత్యేకత చూపాడు. దీంతో.. గురువారం జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టులో ఆ ఫస్ట్ క్లాస్ క్రికెటర్నే ఖాయం చేసేట్లుగా కనిపిస్తోంది. 'అశ్విన్ని రెగ్యులర్ ఆఫ్ స్పిన్నర్గా పరిగణించడం లేదు. అతను వేసే కొన్ని బంతులు బ్యాట్స్మెన్పైకి కాకుండా.. దూరంగా వెళ్తున్నాయి. అందుకే అతడ్ని సాధారణ స్పిన్నర్గానే చూస్తాను. బర్మింగ్హామ్ టెస్టులో అతను బౌలింగ్ చేసిన వీడియోలను పరిశీలించా. అతడి బౌలింగ్ శైలిని పరిశీలించి.. ఏ బంతి వేయబోతున్నాడో..? ముందే పసిగట్టవచ్చు. లార్డ్స్లో అశ్విన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం' అని ఒలీ పోప్ వెల్లడించాడు.